విచారణ ఉన్నప్పుడే టెస్టులు పెంచుతరా? బతిమిలాడాలా?

విచారణ ఉన్నప్పుడే టెస్టులు పెంచుతరా? బతిమిలాడాలా?
  • రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
  • ఇన్ఫర్మేషన్‌ కావాలంటే సర్కారును బతిమిలాడాలా?
  • టెస్టు సెంటర్లు పెంచమంటే నెలలో ఒక్కటి పెంచుతరా?
  • 50 లక్షల టెస్టులు చేశామనడం ఆపండి..పక్క రాష్ట్రాల్లో ఇంకెక్కువ చేసిన్రు
  • టెస్టులు, ప్రైవేటు దోపిడీపై 24లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు‘కరోనా కేసులపై హైకోర్టులో విచారణ జరిగే ముందు మాత్రమే టెస్టులు పెంచుతరా? తర్వాతా తగ్గించేస్తారా? సెకండ్‌ వేవ్‌ ముప్పుందని తెలిసినా జాగ్రత్తలు తీసుకపోతే పరిస్థితి సీరియస్‌ అవుతుందని తెలియదా? కరోనా నియంత్రణకు సర్కారు దగ్గర అసలు ప్రణాళిక ఉందా లేదా? ఐదారు వారాలుగా మేమిచ్చిన ఆదేశాలు అమలు చేయరా? ప్రభుత్వాన్ని బతిమాలి బామాలి వివరాలు తెప్పించుకోవాలా’ అని రాష్ట్ర సర్కారుపై హైకోర్టు సీరియస్ అయింది. కేరళ, ఢిల్లీల్లో సెకండ్‌ వేవ్‌ స్టార్టయిందని, చైనా రోడ్లపై డెడ్‌బాడీలు కనబడుతున్నాయని, కొన్ని దేశాలు మళ్లీ లాక్‌డౌన్‌ పెట్టాయని గుర్తు చేసింది. ఇలాంటి టైమ్‌లో టెస్టులు తగ్గించడమేంటని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. కరోనాపై, ప్రైవేట్‌‌ ఆస్పత్రుల దోపిడీలపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను చీఫ్‌‌ జస్టిస్‌‌ ఆర్‌‌ఎస్‌‌ చౌహాన్, జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డిల డివిజన్‌‌ బెంచ్‌‌ గురువారం మరోసారి విచారించింది.

హైదరాబాద్‌‌లో కరోనా రూల్స్‌‌ ఏవీ అమలైతలేవు

‘50 లక్షల టెస్టులు చేశామని చెప్పకోడాన్ని ప్రభుత్వం కట్టిపెట్టాలి. ఏపీలో టెస్టులు బాగా జరుగుతున్నాయి. మహారాష్ట్రలో 82 లక్షలు, తమిళనాడులో 98 లక్షలు టెస్టులు చేశారు. ఆ సంఖ్యతో పోలిస్తే రాష్ట్రంలో సగమే చేశామని గుర్తు పెట్టుకోండి’ అని మండిపడింది. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో అలసత్వం కనబడుతోందంది. హైదరాబాద్‌‌లో కరోనా రూల్స్‌‌ ఏవీ అమలవట్లేదని, ఎవరూ మాస్కులు పెట్టుకోవట్లేదని, ఫిజికల్‌‌ డిస్టెన్స్‌‌ పాటించట్లేదని ఆందోళన వ్యక్తం చేసింది. వరద సాయం కోసం జనం భారీ సంఖ్యలో క్యూల్లో అదే మాదిరిగా నిలబడ్డారంది. రాజస్థాన్‌‌లో మాస్క్‌‌ లేకపోతే ఫైన్‌‌ వేస్తున్నట్లు ఇక్కడ కూడా కఠినంగా వ్యవహరించాలని సూచించింది.

వారంలో ఒక్క రోజైనా లక్ష టెస్టులు చేయాలె

అక్టోబర్‌‌ 12 నాటి హైకోర్టు ఉత్తర్వుల్లోని చాలా విషయాలు అమలు చేయలేదని, వాటిని అమలు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 50 వేల టెస్టులు చేయాలని, వారంలో ఒక్కరోజైనా లక్ష టెస్టులు చేయాలంది. కరోనా రెండో దశ గురించి హెచ్చరికలు వస్తున్నాయని, కాబట్టి వైరస్‌‌ కట్టడికి జీవో 64లో పేర్కొన్న మార్గదర్శకాలు అమలు చేయాలని ఆదేశించింది. కరోనా ట్రీట్‌‌మెంట్‌‌ పేరుతో ఎక్కువ బిల్లులు వసూలు చేసిన ప్రైవేటు ఆస్పత్రులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని, కిట్ల కొరతను నివారించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 24లోగా ప్రభుత్వం సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తర్వాతి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది.

మాస్కు లేకుంటే వెయ్యి ఫైన్‌‌ వేస్తున్నం: సర్కారు

334 ఆస్పత్రులపై 1,409 ఫిర్యాదు అందాయని, వాటిలో 1,261 పరిష్కరించామని, 148 పెండింగ్‌‌లో ఉన్నాయని కోర్టుకు విచారణకు హాజరైన పబ్లిక్‌‌ హెల్త్‌‌ డైరెక్టర్‌‌ శ్రీనివాసరావు వివరించారు. మాస్కు లేకుండా బయటకొస్తే రూ.వెయ్యి జరిమానా విధిస్తున్నామన్నారు. హైకోర్టు ఉత్తర్వులు అమలు చేస్తున్నామని, శక్తి వంచలేకుండా కరోనాపై పోరాటం చేస్తున్నామని చెప్పారు. 50 లక్షల టెస్టులు చేశామని, వేరే రాష్ట్రాల జనాభాను పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రంలో బాగా చేశామని వివరించారు.

ప్రణాళిక ఉంటే.. జేబులో పెట్టుకొని ఏం లాభం?

‘గతంలో మేమిచ్చిన ఉత్తర్వుల అమలుకు సంబంధించిన రిపోర్టును కేసు విచారణ టైమ్‌‌లో ఇవ్వడం కామనైపోయింది. విచారణ టైమ్‌‌లోనే దాన్ని చదువుకోవాల్సి వస్తోంది. పోనీ ఆ రిపోర్టులో ఏమైనా ఉంటుందా అంటే అరకొర ఇన్ఫర్మేషనే’ అని ప్రభుత్వంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేట్‌‌ ఆస్పత్రుల ఫీజుల దోపిడీపై తీసుకున్న చర్యల వివరాలను ఇవ్వకపోగా వచ్చే విచారణలో చెబుతామంటే ఎట్లాగని ప్రశ్నించింది. ప్రభుత్వ పరీక్షల కేంద్రాల్ని పెంచాలని ఆదేశిస్తే నెలలో ఒకే ఒక కేంద్రాన్ని పెంచుతారా అని అడిగింది. కరోనా కట్టడికి ప్రభుత్వం దగ్గర ప్రణాళిక ఉందని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌‌ జనరల్‌‌ బీఎస్‌‌ ప్రసాద్‌‌ చెప్పగా.. ‘ఉంటే జేబులో పెట్టుకొని ఏం ఉపయోగం’ అని నిలదీసింది. 4 నెలలుగా చేసిన టెస్టుల లెక్క తీస్తే అసలు విషయం బయటపడుతుందంది.

ఏపీలో టెస్టులు బాగా చేస్తున్నరు

50 లక్షల టెస్టులు చేశామని చెప్పుకోవడాన్ని ప్రభుత్వం కట్టిపెట్టాలి. ఏపీలో టెస్టులు బాగా జరుగుతున్నాయి. మహారాష్ట్రలో 82 లక్షలు, తమిళనాడులో 98 లక్షలు టెస్టులు చేశారు. ఆ సంఖ్యతో పోలిస్తే రాష్ట్రంలో సగమే చేశామని గుర్తు పెట్టుకోండి.

– హైకోర్టు