
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు పెంచాలని 3 వారాలుగా ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నా.. తమ ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. వైద్య సిబ్బందికి తగిన కరోనా నివారణ కిట్లు ఇవ్వడం లేదన్న పిల్ పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. విచారణలో భాగంగా.. కరోనా పై పోరాడుతున్న వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కులు ఎన్ని వచ్చాయి? సిబ్బందికి ఎన్ని ఇచ్చారో నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన వివరాలను రేపటిలోగా సమర్పించాలని గాంధీ, నిమ్స్, ఫీవర్, కింగ్ కోఠి ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేసింది. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, గాంధీ సూపరింటెండెంట్ విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది.
గాంధీ ఆసుపత్రిలో జూడాలు సమ్మె చేయడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలోని 33 జిల్లాలకు కరోనా విస్తరించిందని, రాష్ట్రంలో కరోనా పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. కరోనాను ఎదుర్కొనే సన్నద్ధత రాష్ట్రంలో తగినంతగా కనిపించడం లేదని, కరోనా నియంత్రణ పై ప్రభుత్వానికి ఆసక్తి, ఉత్సాహం పోయిందని ప్రభుత్వానికి చురకలు అంటించింది హైకోర్టు . ప్రజలే ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవాలన్న ధోరణి ప్రభుత్వం లో కనిపిస్తోందని అభిప్రాయపడింది..
కరోనా చికిత్సలు గాంధీకే ఎందుకు పరిమితం చేశారని, నిమ్స్ వంటి ఆస్పత్రులను ఎందుకు వినియోగించడం లేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కంటైన్ మెంట్ ప్రాంతాల్లో ఇంటింటికీ పరీక్షలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తూ… పరీక్షలు తక్కువ చేస్తే కరోనా వ్యాప్తి తీవ్రత ఎలా తెలుస్తుందని మండిపడింది. మీడియా బులెటిన్లలో కరోనా గణాంకాలు గజిబిజిగా ఉంటున్నాయని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని.. తాము మరింత కఠినంగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటే.. అలాగే ఉంటామని వ్యాఖ్యానించింది.