ఇవాళ ఆలిండియా సర్వీస్ ఆఫీసర్ల క్యాడర్‌‌ను తేల్చనున్న హైకోర్టు

ఇవాళ ఆలిండియా సర్వీస్ ఆఫీసర్ల క్యాడర్‌‌ను తేల్చనున్న హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో పనిచేస్తున్న 9 మంది ఆలిండియా సర్వీస్ ఆఫీసర్ల క్యాడర్‌‌ను హైకోర్టు తేల్చనుంది. ఇందుకు సంబంధించి శుక్రవారం తీర్పు వెలువరించనుంది. ఏపీ క్యాడర్‌‌కు చెందిన ఆరుగురు ఐఏఎస్‌లు, ముగ్గురు ఐపీఎస్‌లు క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో తెలంగాణలో పనిచేస్తున్నారు. అయితే సోమేశ్‌ కుమార్ క్యాడర్ విషయంలో వారం కిందటే హైకోర్టు స్పష్టమైన జడ్జిమెంట్ ఇవ్వడం.. అందుకు అనుగుణంగా డీవోపీటీ ఆదేశాలు రావడంతో ఆయన తెలంగాణలో సీఎస్ పోస్టును వదులుకుని.. రెండు రోజుల వ్యవధిలోనే ఏపీలో రిపోర్ట్ చేశారు.

ప్రస్తుతం ఇన్‌చార్జ్ డీజీపీ హోదాలో ఉన్న అంజనీ కుమార్​ కూడా ఏపీ క్యాడరే. ఆయనతో పాటు ఐపీఎస్​లు సంతోష్ మెహ్రా, అభిలాష్ భిష్త్ ఉన్నారు. ఐఏఎస్‌లలో టీఎస్​పీఎస్సీ సెక్రటరీగా ఉన్న వాణీ ప్రసాద్, ఎడ్యుకేషన్ సెక్రటరీ వాకాటి కరుణ, ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ రొనాల్డ్​ రాస్, ప్రభుత్వ అదనపు కార్యదర్శి, ఆయుష్ కమిషనర్ ఎ.ప్రశాంతి, మరో ఐఏఎస్ సేతు మాధవన్, కాటా ఆమ్రపాలి (ప్రస్తుతం సెంట్రల్ డిప్యూటేషన్) ఏపీలో పనిచేయాల్సి ఉండగా క్యాట్ ఉత్తర్వులతో తెలంగాణ క్యాడర్​లో పనిచేస్తున్నారు. సోమేశ్‌ కుమార్‌‌కు వచ్చిన జడ్జిమెంట్ మాదిరే వీళ్లకూ వచ్చే అవకాశం ఉంది. ఇక తెలంగాణ క్యాడర్‌‌కు చెందిన ఐఏఎస్‌లు శివశంకర్ లహోటి, హరి కిరణ్, గుమ్మల్ల సృజన ఏపీలో పనిచేస్తున్నారు.