మూసీ సుందరీకరణ భూమి బాధితులకు ..ప్లాట్‌‌‌‌‌‌‌‌ ఇవ్వకపోతే జైలుకెళ్లాల్సిందే

మూసీ సుందరీకరణ భూమి బాధితులకు ..ప్లాట్‌‌‌‌‌‌‌‌ ఇవ్వకపోతే జైలుకెళ్లాల్సిందే
  • మూడు నెలల్లోగా మా ఉత్తర్వులు అమలు చేయకపోతే మీకు జైలే
  •  హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీ అధికారులు అరవింద్‌‌‌‌‌‌‌‌ కుమార్, ప్రసూనాంబకు హైకోర్టు హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: మూసీ అభివృద్ధి, సుందరీకరణలో భాగంగా సేకరించిన భూమికి ప్రత్యామ్నాయంగా యజమానికి మూడు నెలల్లో ప్లాటు అప్పగించాలని, లేదంటే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని అధికారులను హైకోర్టు హెచ్చరించింది. ఉప్పల్‌‌‌‌‌‌‌‌ భగాయత్‌‌‌‌‌‌‌‌లో మూసీ సుందరీకరణకు చేపట్టిన 99.13 ఎకరాల భూ సేకరణలో భూమి కోల్పోయిన వారికి పరిహారంగా ఎకరానికి 1,000 చదరపు గజాలు అభివృద్ధి చేసిన ప్లాటును కేటాయించాలన్న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ మున్సిపల్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ అథారిటీ (హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ) ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించి జీవో జారీ చేసింది.

 ఈ మేరకు భూమిని కోల్పోయిన ఎస్‌‌‌‌‌‌‌‌.రాంరెడ్డికి 666.67 చదరపు గజాలున్న ప్లాటు నం.181కు కేటాయించి, రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ చేసి ఇవ్వలేదు. దీంతో బాధితుడు 2011లో హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారించిన హైకోర్టు.. ప్లాట్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ చేసివ్వాలని ఆదేశాలిచ్చినా ఫలితం లేకపోవడంతో మరోసారి 2020లో కోర్టు మెట్లు ఎక్కాడు. ఈ పిటిషన్‌‌‌‌‌‌‌‌పై విచారించిన హైకోర్టు 2023 ఫిబ్రవరిలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ మూడు నెలల్లో ప్లాటు రిజిస్టర్‌‌‌‌‌‌‌‌ చేసివ్వాలని ఆదేశించినా అధికారులు అమలు చేయలేదు. దీంతో బాధితుడు రాంరెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశాడు. దీనిపై జస్టిస్‌‌‌‌‌‌‌‌ సీవీ భాస్కర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి విచారణ చేపట్టారు. 

ఈ క్రమంలో పురపాలక శాఖ కౌంటరు దాఖలు చేయగా.. పిటిషనర్‌‌‌‌‌‌‌‌కు కేటాయించిన ప్లాట్‌‌‌‌‌‌‌‌ 181 సర్వే నం.454లో ఉందని, దీనికి సంబంధించి మరో వ్యక్తి హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారన్నారు. స్టే ఉన్నందున అమలు చేయలేకపోయామని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. పిటిషనర్‌‌‌‌‌‌‌‌ రెండోసారి హైకోర్టును ఆశ్రయించినప్పుడు హైకోర్టు స్టే ఉత్తర్వుల తొలగింపునకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినా అమలు చేయలేదని గుర్తుచేశారు. అధికారులు భూమిని తీసుకుని ప్రత్యామ్నాయంగా ప్లాట్‌‌‌‌‌‌‌‌ గానీ, పరిహారం గానీ చెల్లించలేదన్నారు. గత మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం మూడు నెలల్లో ప్లాటును రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ చేసివ్వకపోతే ప్రతివాదులైన పురపాలక శాఖ కార్యదర్శిగా, హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ కమిషనర్‌‌‌‌‌‌‌‌గా పనిచేసిన అరవింద్‌‌‌‌‌‌‌‌ కుమార్, హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ భూసేకరణ అధికారి ప్రసూనాంబ రెండు వారాల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా కట్టాల్సి ఉంటుందని హైకోర్టు తేల్చి చెప్పింది. చెల్లించకపోతే మరో వారం జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.