
- వానాకాలంలో భారీ వరదలు వస్తే ప్రజలకు తప్పనిరవాణా కష్టాలు
- కొత్తగూడలో రోడ్ డైవర్షన్లేకుండా కాంట్రాక్టర్ పనుల నిర్వహణ
- పాకాల ఏటిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి స్థానికులు ఎదురు చూపు
మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్ జిల్లాలో గతేడాది కురిసిన భారీ వానలతో వివిధ ప్రాంతాల్లో పలు వంతెనలు కొట్టుకుపోయాయి. అక్కడ కొత్తవి నిర్మించలేదు. కొట్టుకుపోయిన వాటికి మరమ్మతులు చేయలేదు. దీంతో వచ్చే వానాకాలంలో కష్టాలు తప్పేలా లేవంటూ సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం మొదలైనందున ఇప్పటికైనా వంతెనల నిర్మాణాలను పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
అసంపూర్తి పనులతో ఆగమాగం
జిల్లాలోని కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి సమీపంలో వంతెన నిర్మాణానికి ఏడాది కింద ప్రభుత్వం రూ.1.90 కోట్లు మంజూరు చేసింది. కాంట్రాక్టర్లు పిల్లర్ల వరకు పనులు చేసి వదిలేశారు. వానాకాలంలో గ్రామాల వైపు వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులు, వాహనాలు పెగడపల్లి మీదుగా పోవాల్సి వస్తుంది. ముస్మీ పంచాయతీ పరిధి తండా సమీపంలో రూ.3.50 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. అయితే.. రోడ్ డైవర్షన్ లేక ఐదు గ్రామాలకు రాకపోకల అంతరాయం కలుగుతుండగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోయగూడెం, కిష్టాపురం మధ్య పెద్దవాగుపై వంతెన లేక గతంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఎడ్ల బండ్లు కొట్టుకుపోయిన ఘటనలు ఉన్నాయి.
ఇరు గ్రామాలకు చెందిన వాగుకు ఇరువైపులా తారురోడ్డు ఉన్నా వంతెన లేక కష్టాలు పడుతున్నారు. బయ్యారం మండలంలో మహబూబాబాద్ ప్రధాన రహదారిలోని పాకాల వాగు వంతెన పిల్లర్ వద్ద గతేడాది వర్షాలకు పెద్ద గొయ్యి ఏర్పడింది. వాటి చుట్టూ పది అడుగుల మేర మట్టి కొట్టుకుపోయింది. దీంతో వంతెన ప్రమాదకరంగా మారింది. అల్లిగూడెం, సుద్ద రేవు వద్ద పంది పంపుల వాగుపై నిర్మించిన వంతెనల పిల్లర్లు దగ్గరగా నిర్మించడంతో అడవిలోంచి వచ్చే వరదలతో కలప కొట్టుకొచ్చి వంతెన వద్ద అడ్డుపడుతుంది. దీంతో సమీప గ్రామాల్లోకి నీరు పోటెత్తి రాకపోకలు బంద్ అవుతాయి.
పదిహేనేండ్లుగా ఎదురు చూస్తుండగా..
గార్ల మండల కేంద్రంలో పాకాల వాగుపై పదిహేనేండ్లుగా హైలెవల్ వంతెన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. చెక్ డ్యామ్ వద్ద హైలెవల్ వంతెన నిర్మించకపోవడంతో వర్షాకాలంలో వరద ఉప్పొంగుతుంది. ఏటా చెక్ డ్యామ్ దాటే క్రమంలో వరదలో వాహనాలు కొట్టుకుపోయి చాలామంది ప్రమాదాల బారిన పడ్డారు. ఇక్కడ హై లెవల్ వంతెన నిర్మాణానికి 2023లో రూ.15 కోట్ల సీఆర్ఆర్ నిధులతో గత పాలకులు ఎన్నికలకు ముందు హడావుడిగా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించలేదు. త్వరగా వంతెన నిర్మిస్తే 15 గ్రామాలకుపైగా ప్రజలకు రవాణా సౌకర్యాలు అందుతాయి.
వట్టి వాగు వరద కష్టాలు తప్పేలాలేవు
భారీ వర్షాలతో కేసముద్రం- – గూడూరు ప్రధాన రహదారిలో అర్పనపల్లి సమీపంలో వట్టి వాగుపై లో- లెవల్ వంతెన వద్ద నీరు ప్రవహించి పలువురు కొట్టుకుపోయిన ఘటనలు ఉన్నాయి. హై-లెవల్ వంతెన నిర్మాణానికి సర్కార్ నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచినా పనులు చేపట్టలేదు. వానాకాలంలో భారీగా వర్షాలు కురిస్తే రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది.