
జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద దన్వాడలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు 12 గ్రామాల ప్రజలు. పెద్ద ధన్వాడకు భారీగా తరలివచ్చారు రైతులు, మహిళలు. గాయత్రి ఇథనాల్ కంపెనీకి చెందిన కార్లు, టెంట్లు, సామాగ్రి ధ్వంసం చేశారు .జేసీబీలను అడ్డుకుని వాహనాలకు నిప్పు పెట్టారు. ఘటనా స్థలానికి భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. నిరసనకు దిగిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు,ఆందోళనకారులకు మధ్య ఘర్షణ తలెత్తింది. పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా నిరసన చేస్తున్నారు ప్రజలు. ఆరు నెలలుగా నిలిచిపోయిన ఇథనాల్ ఫ్యాక్టరీ పనుల్లో కదలిక రావడంతో రాజోలి మండల పరిధిలోని పెద్ద ధన్వాడ గ్రామస్తులు నిరసనకు దిగారు. ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యం దొంగచాటున కంటైనర్లు, టిప్పర్లు, హిటాచిలను తీసుకురావడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో స్థానిక గ్రామాల ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున ఇవాళ ఆందోళనకు దిగారు. ఘటనా స్థలానికి వచ్చి కంపెనీ సామాగ్రిని, కార్లను ధ్వంసం చేశారు.
Also Read : జూన్ 6న ఎస్ఆర్ యూనివర్సిటీ స్నాతకోత్సవం
గతంలో ఫ్యాక్టరీ నిర్మాణాన్ని చేపట్టవద్దని నిరాహార దీక్ష చేశామన్నారు రైతులు. తహసీల్దార్, ఆర్డీఓ సమక్షంలో అభిప్రాయ సేకరణ జరగ్గా 12 గ్రామాల ప్రజలు ముక్త కంఠంతో ఫ్యాక్టరీ నిర్మాణాన్ని చేపట్టవద్దని తీర్మానించామన్నారు. ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు వెనక్కి తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
.