
దండేపల్లి, వెలుగు: ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ యువకుడు అత్తింటివారి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన చెన్నవేని వెంకటేశ్(28) అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ఆరేండ్ల కిందట ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి ఇష్టంలేని యువతి తండ్రి, అన్నదమ్ములు, మేనత్త నుంచి వెంకటేశ్కు వేధింపులు ఎక్కువయ్యాయి. తనను సూటిపోటి మాటలతో వేధిస్తున్నారని పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టించాడు. పోలీస్స్టేషన్లోనూ ఫిర్యాదు చేసి కౌన్సెలింగ్ ఇప్పించినా వాళ్ల తీరులో మార్పు రాలేదు. ఈ క్రమంలో శుక్రవారం యువతి తల్లిదండ్రులతో జరిగిన గొడవలో వెంకటేశ్ పై చేయిచేసుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన వెంకటేశ్.. ఊరి పెద్ద చెరువు దగ్గరకి వెళ్లి పురుగుల మందు తాగాడు. తన చావుకు కారకులైన అత్తింటివారిని కఠినంగా శిక్షించాలని ఫోన్లో వాయిస్ రికార్డ్ చేసి తన కుటుంబ సభ్యులకు సెండ్ చేశాడు. వారు వెంటనే వెంకటేశ్దగ్గరికి చేరుకొని కరీంనగర్ లో ఓ ప్రైవేట్హాస్పిటల్ కు తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం వెంకటేశ్ చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.