
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం రాంనూతుల శివార్లలోని అనంతగిరి (అంతరగిరి) గుట్టల్లోని గుహలలో క్రీ.శ. 14వ శతాబ్దం నాటి పద్మనాయకుల కాలపు రేఖాచిత్రాలు (పెట్రోగ్లిఫ్స్) వెలుగులోకి వచ్చాయి. ఇటీవల బ్రహ్మదేవునిగుట్ట, విష్ణుదేవుని గుట్ట (అనంతగిరి) కు వెళ్లినప్పుడు ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ ఈ పెట్రోగ్లిఫ్స్ ను గుర్తించారు.
ఈ గుహల్లో వేల ఏళ్ల క్రితం చరిత్ర పూర్వయుగపు ఆది మానవులు వేసిన రాక్ పెయింటింగ్స్ (ఎరుపు రంగు చిత్రాలు) ఆనవాళ్లు కూడా ఉన్నాయి. అయితే, స్థానిక గిరిజనులు సున్నం పూయడంతో అవి కనుమరుగైపోయాయి. అనంతగిరి ప్రధాన గుహలో ఒకచోట అడుగు పొడవు, అరడుగు వెడల్పు పరిమాణంలో గుర్రం, వినాయకుల రేఖాచిత్రాలు ఉన్నాయి. అదే రాయికి మరో పక్కన నిల్చుని పడగ విప్పిన నాగుపాము రేఖా చిత్రం ఉంది. ఆ పక్కనే సొరికెలో కాలుమీద కాలు వేసుకుని పద్మాసనంలో కూర్చుని ఉన్న యోగి రేఖాచిత్రం ఉంది.
బాగా పెరిగిపోయిన తన వెంట్రుకల జడలను తలపై నాలుగు వరుసలుగా ముడుచుకున్నాడు. గుహకు ఆగ్నేయంలో ఉన్న గుండు పాద భాగంలో రెండు అడుగుల ఎత్తులో పబ్బతి ఆంజనేయుడు, గరుత్మంతుల రేఖాచిత్రాలు ఉన్నాయని సత్యనారాయణ వెల్లడించారు. అయితే ఈ పెట్రోగ్లిఫ్స్ కు జాజు పూసి దేవీదేవతలుగా పూజిస్తున్నారని ఆయన తెలిపారు.