- రూ. 1.38 కోట్లతో రోడ్డు సేఫ్టీ ప్రాజెక్టు త్వరలోనే టెండర్లు
హైదరాబాద్సిటీ, వెలుగు: అతిపెద్దదైన పీవీ ఎక్స్ప్రెస్హైవేపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో హెచ్ఎండీఏ నివారణ చర్యలు చేపట్టింది. సుమారు 17 ఏండ్ల కింద నిర్మించిన 11.60 కి.మీ. పొడవైన ఈ ఫ్లై ఓవర్పై ఫోర్వీలర్స్కే మాత్రమే అనుమతి ఉంది. దీనిపై ఇప్పటికీ ఎలాంటి ట్రాఫిక్సూచికలు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఎక్స్ప్రెస్వేపై చాలా చోట్ల మూల మలుపులు ఉండడంతో హైస్పీడ్తో వెళ్తూ అదుపు తప్పుతున్నాయి.
కొందరు వాహనదారుల నిర్లక్ష్యం కూడా యాక్సిడెంట్లు పెరగడానికి కారణమవుతున్నది. అంతేగాకుండా లక్ష్మీనగర్(పిల్లర్ నంబర్84 నుంచి 88 వరకు), ఉప్పర్పల్లి (పిల్లర్ నంబర్170) వైపు, ఆరామ్ఘర్వద్ద ఫ్లై ఓవర్పైకి ఎక్కడానికి, దిగడానికి రెండు వైపులా ఎగ్జిట్, ఎంట్రీ పాయింట్లున్నాయి. సూచిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పైకి ఎక్కే టైంలో, దిగే సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు..
ప్రమాదాల నివారణకు పీవీ ఎక్స్ప్రెస్పై రూ.1.38 కోట్లతో అధికారులు రోడ్ సేఫ్టీ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. ఈ ఫ్లై ఓవర్పై స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తరచూ ట్రాఫిక్ జామ్అయ్యే ప్రాంతాలను గుర్తించారు. అలాగే, ఫ్లై ఓవర్పై ఎక్కడ ఎంత స్పీడ్తో వెళ్లాలి? ఎక్కడ మలుపులు ఉన్నాయి అన్న విషయాలు తెలిసేందుకు బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ఫ్లై ఓవర్కు రెండు వైపులా రిఫ్లెక్టివ్ బోర్డులు కూడా పెట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే టెండర్లను పిలవనున్నారు. ఎంపిక చేసిన కంపెనీ మూడు నెలల్లో పనులు పూర్తి చేయాలన్న నిబంధన పెట్టారు.
