
హాంకాంగ్: ఇండియా స్టార్ షట్లర్ లక్ష్యసేన్.. హాంకాంగ్ ఓపెన్లో సెమీస్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో లక్ష్యసేన్ 21–16, 17–21, 21–13తో ఆయుష్ షెట్టిపై గెలిచాడు. గంటా ఆరు నిమిషాల మ్యాచ్లో ఆయుష్ గట్టి పోటీ ఇచ్చాడు. తొలి గేమ్లో 10–10 స్కోరు సమం చేసిన తర్వాత ఒక్కో పాయింట్తో ముందుకెళ్లాడు. అయితే స్కోరు 13–11 వద్ద లక్ష్య వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి ముందంజ వేశాడు.
అక్కడి నుంచి ఇక వెనుదిరిగి చూసుకోలేదు. రెండో గేమ్లో 16–17తో వెనకబడిన ఆయుష్ వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి మ్యాచ్లో నిలిచాడు. డిసైడర్లో 9–9 స్కోరు వరకు ఇద్దరి మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. 12–11 వద్ద లక్ష్య వరుసగా రెండు, రెండు, ఐదు పాయింట్లు గెలిచి మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. మెన్స్ డబుల్స్ క్వార్టర్స్లో ఎనిమిదో సీడ్ సాత్విక్–చిరాగ్ షెట్టి 21–14, 20–22, 21–16తో జునైది ఆరీఫ్–రాయ్ కింగ్ యాప్ (మలేసియా)ను ఓడించి సెమీస్లోకి అడుగుపెట్టారు.
64 నిమిషాల మ్యాచ్లో నెమ్మదిగా ఆట మొదలుపెట్టిన ఇండియన్ ద్వయం ఒక్కసారి లయ అందుకున్న తర్వాత వరుస పాయింట్లతో హోరెత్తించింది. రెండో గేమ్లో గట్టి పోటీ ఎదుర్కొన్న సాత్విక్–చిరాగ్ మూడో గేమ్లో ప్రత్యర్థులకు కీలక టైమ్లో అడ్డుకట్ట వేశారు. 2–2తో స్కోరు సమమైన తర్వాత మలేసియన్లు ఒక్కసారి కూడా దాన్ని రిపీట్ చేయలేకపోయారు. దాంతో స్పష్టమైన ఆధిక్యంతో ముందుకెళ్లిన సాత్విక్ ద్వయం ఈజీగా గేమ్, మ్యాచ్ను ముగించింది.