సూర్యాపేట జిల్లా పాలకవీడు తహసీల్దార్ ఆఫీసుకు తాళం వేశారు ఇంటి యజమాని. రెండేళ్లుగా అద్దె చెల్లించకపోవడంతో విసిగిపోయిన ఇంటి యజమాని జనార్దన్ రెడ్డి గురువారం ( సెప్టెంబర్ 10 ) తాళం వేసినట్లు తెలిపారు. అద్దె చెల్లించాలని కలెక్టర్, ఆర్డీవోకు పలుమార్లు విజ్ఞప్తి చేసిన పట్టించుకోలేదని.. జాయింట్ కలెక్టర్ను కూడా కలిసి అద్దె బకాయిలు చెల్లించాలని కోరానని అంటున్నారు జనార్దన్రెడ్డి..
అద్దె చెల్లించాలని అడిగితే జీవో పేపర్ తీసుకురావాలని అధికారులు చెబుతున్నారంటూ ఆరోపిస్తున్నారు జనార్దన్ రెడ్డి. చాలా కాలం పాటు అధికారుల చుట్టూ తిరిగానని.. చేసేదేమిలేక ఇంటికి తాళం వేశానని తెలిపారు. అద్దె చెల్లిస్తేనే ఇంటి తాళం తీస్తానని అంటున్నారు యజమాని.
►ALSO READ | బోడుప్పల్ లో భారీ అగ్నిప్రమాదం.. హోటల్ లో మంటలు...పేలిన రెండు గ్యాస్ సిలిండర్లు..
తహసీల్దారు కార్యాలయానికి తాళం వేయడంతో ఎక్కడికక్కడ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ విషయం తెలియక తహసీల్దార్ ఆఫీసుకు వచ్చిన జనం అసహనంతో వెనుదిరుగుతున్నారు. ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి పెట్టి అద్దె బకాయిలు చెల్లించాలని.. తహసీల్దార్ ఆఫీసు తెరిపించాలని కోరుతున్నారు.
