
- వారం కిందట అఖీల్ అనుమానాస్పదంగా మృతి
- సెల్ఫీ వీడియో తాజాగా వెలుగులోకి
- తన భార్యతో తండ్రికి సన్నిహిత సంబంధం ఉందని ఆరోపణ
- తల్లిదండ్రులు సహా నలుగురిపై హత్య కేసు నమోదు
చండీగఢ్: పంజాబ్లో మాజీ డీజీపీ మహమ్మద్ ముస్తాఫా, పంజాబ్ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత రజియా సుల్తానా దంపతుల కొడుకు అఖీల్ అఖ్తర్ మృతి సంచలనంగా మారింది. తన భార్యతో తండ్రికి సన్నిహిత సంబంధం ఉందంటూ మరణానికి ముందు అఖీల్ సంచలన ఆరోపణలు చేశాడు. అందుకు సంబంధించిన వీడియో తాజాగా బయటకు రావడంతో ఈ కేసు చర్చనీయాంశమైంది. అఖీల్ అఖ్తర్ ఈ నెల 16న రాత్రి పంచకులలోని ఎండీసీ సెక్టార్ 4 లో ఉన్న తన ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్నట్లు అతని కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే హాస్పిటల్కు తరలించగా అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
అయితే, తమ కొడుకు అఖీల్ డ్రగ్ ఓవర్డోస్ కారణంగానే చనిపోయాడని అతడి తల్లిదండ్రులు ముస్తాఫా, రజియా సుల్తానా పోలీసులకు తెలిపారు. వారి వాంగ్మూలంతో అఖీల్ అనారోగ్య సమస్యల కారణంగానే మృతి చెందినట్లు పోలీసులు కూడా కన్ఫామ్ చేశారు. కానీ, అఖీల్ మరణించిన కొన్ని రోజుల తర్వాత అతని ఫ్రెండ్ పోలీసులను ఆశ్రయించాడు. అఖీల్ మృతిపై తనకు అనుమానం ఉందని.. అతనిది హత్య కావచ్చని ఆరోపణలు చేశాడు. అదే టైంలో ఆగస్టు 27న అఖీల్ రికార్డు చేసిన ఒక వీడియో బయటకు రావడంతో కేసు మలుపు తిరిగింది. ఆ వీడియోలో అఖీల్ తన తండ్రి, తన భార్య గురించి సంచలన ఆరోపణలు చేశాడు.
ఆ వీడియోలో ఏముంది?
వీడియోలో అఖీల్ మాట్లాడుతూ.. తన తండ్రి, భార్య మధ్య ఉన్న సంబంధం గురించి పలు విషయాలు చెప్పాడు."నా భార్యకు, మా నాన్నతో సన్నిహిత సంబంధం ఉంది. దాంతో నేను బాధతో మానసికంగా కృంగిపోయాను. ఏంచేయాలో తెలియట్లేదు. నా తల్లి, సోదరి కూడా ఈ కుట్రలో భాగంగా ఉన్నారు. నా పెండ్లికి ముందే నా భార్యతో నా తండ్రికి సన్నిహిత సంబంధం ఉందని తెలిసింది. ఎందుకంటే, ఫస్ట్ నైట్ రోజు ఆమె నన్ను తాకనివ్వలేదు.
ఆమె నన్ను కాదు నా తండ్రిని పెళ్లి చేసుకున్నట్లు ప్రవర్తిస్తోంది. దీని గురించి ఇంట్లో అడిగితే నాకు పిచ్చి పట్టిందంటున్నారు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే, నేను ఇలాగే మాట్లాడితే.. అత్యాచారం, హత్య కేసులో నన్ను ఇరికిస్తామని నా కుటుంబ సభ్యులే బెదిరిస్తున్నారు. నన్ను చంపడం కోసం ప్లాన్ చేస్తున్నారు. దయచేసి ఎవరైనా నాకు సాయం చేయండి. నన్ను రక్షించండి" అని చెప్పుకొచ్చాడు. వీడియో ఆధారంగా మహమ్మద్ ముస్తఫా, రజియా సుల్తానా, అఖీల్ భార్య, అతని సోదరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు తెలిపారు.