ఒడిశాలో జూన్ 2న రాత్రి మూడు రైళ్లు ఢీ కొన్న ఘటనలో మృతుల సంఖ్య 238కి చేరింది. 900మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడిన వారు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇంకా అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రధాని మోడీ ఈ ఘటనపై హైలెవల్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. అయితే అధికారులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 6.50 నుంచి 7.10 గంటల మధ్య నిమిషాల వ్యవధిలో ఈ విషాదం చోటు చేసుకుందని సమాచారం. ఈ సమయంలో ప్రయాణికులు అంతా నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది.
రైలు ప్రమాదం ఎలా జరిగిందంటే..
బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్లోని హావ్డాకు వెళ్తున్న బెంగళూరు- హావ్డా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బాలేశ్వర్ సమీపంలోని బహానగా బజార్ వద్ద జూన్ 2వ తేదీ శుక్రవారం రాత్రి 6.50 గంటలకు అదుపు తప్పింది. దీంతో దాని బోగీలు పక్కనే ఉన్న ట్రాక్పై పడిపోయాయి. అయితే అదే ట్రాక్ పై 120 కిలో మీటర్ల వేగంతో వస్తున్న షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్ప్రెస్.. ఢీకొట్టింది. దీతో కోరమండల్ ఎక్స్ప్రెస్కు చెందిన 15 బోగీలు ఒక్కసారిగా బోల్తాపడ్డాయి. బోల్తాపడ్డ కోరమండల్ కోచ్లను పక్కనున్న ట్రాక్పై దూసుకొచ్చిన గూడ్సు రైలు ఢీకొంది.
మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం తీవ్రత భారీగా పెరిగింది. ఈ ప్రమాదంలో బోగీలు ఎగిరిపడ్డాయి. అందులోని ప్రయాణికులు ట్రాక్ పై చెల్లాచెదురుగా పడిపోయారు. ప్రమాదానికి గురైన సమయంలో కోరమండల్ ఎక్స్ప్రెస్ కోల్కతా నుంచి చెన్నైకి వెళ్తోంది.

