కాశీబుగ్గ(కార్పొరేషన్)/ నర్సంపేట/ భద్రాద్రికొత్తగూడెం/ ఖమ్మం టౌన్/ అశ్వారావుపేట, వెలుగు: బాలికల ఆరోగ్య రక్షణ కోసం హెచ్పీవీ టీకా తీసుకోవాలని పలువురు ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు సూచించారు. ఆదివారం ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని పలుచోట్ల హెచ్పీవీ వ్యాక్సిన్అందజేత కార్యక్రమాన్ని ప్రారంభించారు. హనుకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో వరంగల్ బల్దియా మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ చాహత్బాజ్పాయ్వ్యాక్సిన్ అందజేసి, ధ్రువపత్రాలను పంపిణీ చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో డీఎంహెచ్వో సాంబశివరావు టీకా కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.
కొత్తగూడెంలోని జీజీహెచ్లో కలెక్టర్ అంకిత్, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఖమ్మం జనరల్ ఆస్పత్రిలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హెచ్పీవీ వ్యాక్సినేషన్ను ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఏరియా ఆస్పత్రిలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ టీకా అందజేత కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.
