- మొయినాబాద్ పోలీసులపై చర్యలు తీసుకోవాలనిన్యాయవాది ఇమ్మినేని ఫిర్యాదు
బషీర్బాగ్/పద్మారావునగర్, వెలుగు: పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే న్యాయవాది స్వప్న హత్యకు గురైందని హైకోర్టు న్యాయవాది ఇమ్మినేని రామారావు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేయగా, కమిషన్ విచారణకు స్వీకరించింది. ఈ నెల 4న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ సమీపంలో తన అన్న చేతిలో న్యాయవాది స్వప్న హత్యకు గురైందని కమిషన్కు తెలిపారు. నెల రోజుల క్రితం స్వప్న తన సోదరుడు రాజు నుంచి ప్రాణహాని ఉందని మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదును మొయినాబాద్ పోలీసులు పట్టించుకోలేదని, పరోక్షంగా ఆమె మరణానికి కారకులు అయ్యారని ఆరోపించారు. మొయినాబాద్ సీఐ పవన్ కుమార్ రెడ్డి, ఎస్సై నరసింహారావుపై చట్టపరమైన చర్యలకు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేయాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా న్యాయవాదుల రక్షణ చట్టం అమలుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలన్నారు.
