తెలంగాణ జన యాత్ర మేడారం జాతర

తెలంగాణ జన యాత్ర మేడారం జాతర

దేశంలోని అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర రానేవచ్చింది.  రెండేండ్లకు ఒకసారి మేడారం జనసంద్రమయ్యే సమయం ఆసన్నమైంది. పౌరుషం గల తెలంగాణ ఆడబిడ్డల ఆత్మత్యాగాలను స్మరించుకునే క్షణాలు దగ్గరకొచ్చాయి. ఈ  జాతర గిరిజన సంప్రదాయ రీతిలో జరగడం ఒక విశేషం. మేడారం జాతరకు దేశవ్యాప్తంగా భక్తులు పట్టం కట్టడం అతిపెద్ద విశేషం.

ఫిబ్రవరి 21-24 తేదీల మధ్య నాలుగు రోజులు జరిగే ఈ జాతరలో వివిధ రకాల పూజా ప్రక్రియలు, ఆదివాసుల ప్రత్యేక వస్త్రధారణ  తదితర అంశాలు ఈ ఉత్సవానికి అంతర్జాతీయ ఖ్యాతిని, ప్రాచుర్యాన్ని తెచ్చిపెట్టాయి.  ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో ఈ జాతర జరుగుతున్నది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన ఈ వేడుకకు  రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ఇప్పటివరకు చాలాసార్లు ప్రతిపాదనలు వెళ్ళినా  ఇంతవరకు జాతీయ హోదా లభించలేదు. 

జాతరకు 900 ఏండ్ల చరిత్ర 

కోయ గిరిజనుల ఉనికి కోసం పోరు సల్పిన సమ్మక్క, సారలమ్మ జాతర ఓరుగల్లును పాలించిన ప్రతాప రుద్ర చక్రవర్తి కాలం నుంచి కొనసాగుతున్నట్లు స్థలపురాణాలు చెబుతున్నాయి. జాతరకు 900ఏండ్ల చరిత్ర ఉంది.  ఆ కాలంలో  మేడారం ప్రాంతాన్ని పగిడిద్దరాజు పరిపాలించేవాడు. ఆయన కాకతీయుల సామంతరాజు. ఆయన సతీమణి సమ్మక్క. పగిడిద్దరాజు సమ్మక్క దంపతులకు సారలమ్మ, నాగులమ్మ , జంపన్న అనే ముగ్గురు సంతానం. ఆ కాలంలో వరుసగా మూడు నాలుగేండ్ల పాటు అనావృష్టి ఏర్పడటంతో ప్రజలు పన్నులు కట్టలేని స్థితికి చేరుకున్నారు. 

పగిడిద్దరాజు కప్పం చెల్లించేందుకు నిరాకరించడంతో ప్రతాపరుద్ర చక్రవర్తి గిరిజనులను అణచి వేయడానికి సైనికులను పంపాడు. పగిడిద్దరాజు అతని కుమార్తెలు నాగులమ్మ, సారలమ్మ అల్లుడు గోవిందరాజులతో  కలిసి కాకతీయ సైన్యాన్ని మేడారం సరిహద్దులోని సంపెంగ వాగు వద్ద నిలువరించి వీరోచితంగా పోరాడి వీర మరణం పొందినారు.  కుమారుడు జంపన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 

రూ. 110 కోట్ల నిధులు కేటాయింపు

ఎంతో చరిత్ర నేపథ్యం కలిగిన సమ్మక్క–సారక్క జాతరను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1996లో రాష్ట్ర పండుగగా గుర్తించింది.  విభజన తర్వాత నూతన రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో 2014లో రాష్ట్ర పండుగ ప్రకటించి ఘనంగా జాతర జరుపుతున్నారు. ఈ జాతరకు తెలంగాణ నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది రూ.110 కోట్ల నిధులు కేటాయించి రవాణా,  తాగునీరు,  భద్రత చర్యలు,  వైద్య సదుపాయాలు తదితర 21 శాఖల వారీగా నిధులు ఖర్చు చేస్తూ భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు.  రెండేండ్లకోసారి జరిగే ఈ జాతరకు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్,  చత్తీస్​గఢ్​,  మహారాష్ట్ర , ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు.  ఆరు ప్రధాన రహదారుల ద్వారా ఈ జాతరకు 1కోటి 30లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా.  

జాతీయ హోదా దక్కేనా...

భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధిక మంది భక్తులు హాజరయ్యే పండుగ ఇది.  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఇ) ద్వారా జాతరకు ఎంతమంది వచ్చారో  99 శాతం కచ్చితత్వంతో తెలుసుకుంటారు. దేశంలో ఏ ఉత్సవంలో వినియోగించనివిధంగా కృత్రిమ మేధో సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. లక్షలాది మంది భక్తులకు అసౌకర్యం కలగకుండా, తొక్కిసలాట జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా ఏర్పాట్లు చేస్తుంది.  ఈ ఏడాది కొత్తగా భక్తుల సౌకర్యార్థం మేడారం యాప్​ను ప్రభుత్వం రూపొందించింది. 

ఇంతటి చరిత్ర నేపథ్యం కలిగిన మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నోసార్లు ప్రతిపాదన చేసి మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది.  నాలుగేండ్ల  క్రితం జాతరకు ముఖ్య అతిథిగా విచ్చేసిన  కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అర్జున్ ముండా ఈ మహా జాతర ప్రాముఖ్యత గురించి ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి జాతీయ హోదా ఇప్పిస్తానని ఇచ్చిన వాగ్దానం ఉత్త మాటలుగానే మిగిలిపోయాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మేడారం మహా జాతరకు జాతీయ హోదా కల్పిస్తే జాతర ప్రాశస్త్యంను ప్రపంచం గుర్తిస్తుంది. దీంతో యునెస్కో గుర్తింపు లభించే అవకాశం ఉంది.

అపరకాళి సమ్మక్క 

తన కొడుకు కుమార్తె మరణించారన్న వార్త విన్న  సమ్మక్క  యుద్ధరంగానికి వచ్చి పరాశక్తి అవతారమెత్తి అపరకాళిగా విజృంభించి కాకతీయ సైన్యాలను పరుగెత్తించింది. ఓటమి తప్పదని భావించిన కాకతీయ సైనికులు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెనుక నుంచి పొడవడంతో యుద్ధభూమి నుంచి వైదొలగి మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్ట వద్ద అదృశ్యమైంది. మోసంతో సాధించిన రాజ్యం వీరభోజ్యం కాదని ఈ గడ్డపై పుట్టిన ప్రతి వ్యక్తి వీరుడిగానే రాజ్యాన్ని సంపాదించాలని గ్రహించిన ప్రతాప రుద్రుడు అప్పటి నుంచి సమ్మక్క  భక్తుడిగా మారాడు.  ప్రతాప రుద్రుడు ఈ స్థలంలో రెండు గద్దెలు కట్టించి రెండు సంవత్సరాలకు ఒకసారి ఉత్సవం జరిపించినట్లు చరిత్ర చెబుతోంది.  

మాఘశుద్ధ పౌర్ణమి రోజున మొదలయ్యే ఈ జాతర నాలుగు రోజులు జరుగుతుంది. జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను, కొండ్రాయి నుంచి గోవిందరాజు, పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజును గద్దెలపైకి తీసుకువస్తారు. రెండో రోజున మేడారం సమీపంలోని చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను కుంకుమ భరిణె రూపంలో గద్దెపైకి తీసుకొస్తారు. మూడో రోజు అమ్మవార్లకు భక్తులు మొక్కులు తీర్చుకుంటారు.  తమ కోరికలు తీర్చమని భక్తులు బెల్లం (బంగారం)ను  నైవేద్యంగా సమర్పించుకుంటారు. నాలుగో రోజు పూజలు నిర్వహించిన అనంతరం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను వన ప్రవేశం చేయిస్తారు. దీంతో జాతర ముగుస్తుంది.

- అంకం నరేష్, సోషల్​ ఎనలిస్ట్