న్యూఢిల్లీ: ఓ స్కూల్ వద్ద భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాఖండ్లోని అల్మోరా జిల్లా డాబరా గ్రామంలో గవర్నమెంట్ హైస్కూల్ సమీపంలోని పొదల్లో ఆ పేలుడు పదార్థాలు దొరికాయి. స్కూల్ ప్రిన్సిపాల్ సుభాష్ సింగ్ ముందుగా పేలుడు పదార్థాలను గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని సీజ్ చేశారు. తర్వాత ఉధమ్ సింగ్ నగర్, నైనిటాల్ జిల్లాల నుంచి బాంబ్, డాగ్ స్క్వాడ్లను రప్పించారు.
బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు పొదలను పరిశీలించగా కొన్ని జిలెటిన్ స్టిక్స్ దొరికాయి. కొద్దిదూరంలోనే మరికొన్ని జిలెటిన్ స్టిక్స్ లభ్యమయ్యాయి. మొత్తం 161 జిలెటిన్ స్టిక్స్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి బరువు 20 కిలోలు ఉందని పోలీసు అధికారులు తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. స్కూల్ సమీపంలోకి పేలుడు పదార్థాలు ఎలా వచ్చాయి, ఎవరు వాటిని తీసుకొచ్చారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సీనియర్ సూపరింటెండెంట్ పోలీస్ దేవేంద్ర పించా మీడియాకు వెల్లడించారు.
జిలెటిన్ స్టిక్స్ను సురక్షిత ప్రాంతానికి తరలించామని తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశామని చెప్పారు. ఇటీవలే ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు సంభవించి 15 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. అంతకుముందు హర్యానాలో 3 వేల కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఉత్తరాఖండ్లోని స్కూల్ వద్ద జిలెటిన్ స్టిక్స్ దొరకడం కలకలం రేపింది. కాగా.. జిలెటిన్ స్టిక్స్ను మైనింగ్, కొండలను బ్లాస్ట్ చేయడానికి వాడుతారు.
