- రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా వంద ప్యాక్స్లు! .. విస్తరణ దిశగా టెస్కాబ్ కసరత్తు
- రాష్ట్ర సర్కారుకు ప్రపోజల్స్
- మున్ముందు మండలానికి రెండు ఏర్పాటు
- రైతులకు చేరువకానున్న 30 రకాల సేవలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(ప్యాక్స్) విస్తరణకు రాష్ట్ర కో -ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్(టెస్కాబ్) కసరత్తు చేస్తున్నది. దీనిలో భాగంగా కొత్తగా వంద ప్యాక్స్లు ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర సర్కారుకు ప్రపోజల్స్ పంపించింది. అప్రూవల్ రాగానే ఏర్పాటు చేయడానికి సర్వం సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో సహకార సంఘాల అవసరం ఉన్న నేపథ్యంలోనే విడతల వారీగా పెంచాలని టెస్కాబ్ యోచిస్తోంది.
వెయ్యికి పైగా పెరిగే చాన్స్..
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 906 ప్యాక్స్లు ఉన్నాయి. వీటిద్వారా 12,769 గ్రామాల రైతులకు సేవలు అందిస్తున్నారు. కొత్తవి ఏర్పాటైతే వీటి సంఖ్య వెయ్యికిపైగా పెరిగే అవకాశం ఉంది. కనీసం మండలానికి రెండు ఉంటే రైతులకు సేవలు మరింత చేరువకానున్నాయి. ప్యాక్స్లు ప్రస్తుతం లోన్లు, ధాన్యం కొనుగోలు సెంటర్ల నిర్వహణ తదితర కొన్ని సేవలకే పరిమితమవుతున్నాయి. తాజాగా కేంద్రం ప్యాక్స్ను కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ)గా మార్చి రైతులకు మరిన్ని సేవలు అందించేందుకు నిర్ణయించిన నేపథ్యంలో టెస్కాబ్ ఆ దిశగా కసరత్తు షురూ చేసింది.
క్షేత్రస్థాయిలో విస్తరణకు శ్రీకారం
తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రతీ గ్రామ పంచాయతీకి ఒకటి చొప్పున ప్యాక్స్ను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా టెస్కాబ్ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఐదారు గ్రామాలకు కూడా ఒక ప్యాక్స్ లేదు. రాష్ట్రంలోని 64 మండలాలకు అసలు ప్యాక్స్లే లేవు. ఇలాంటి వాటిని గుర్తిస్తున్నరు. ఉమ్మడి ఏపీలో వైద్యనాథన్ సిఫారసులతో తగ్గిన నేపథ్యంలో కనీసం తిరిగి ఇప్పుడున్న ప్యాక్స్ను రెట్టింపు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. కానీ, కొత్త జిల్లాల ప్రకారం డీసీసీబీల ఏర్పాటుకు ఆర్బీఐ నిబంధనలు అనుమతించడం లేదు. దీంతో కొత్త మండలాలు, గ్రామ పంచాయతీల్లో ఇప్పటికీ ప్యాక్స్ ఏర్పాటు చేయలేదు. ఫలితంగా అక్కడి రైతులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో భవిష్యత్లో మండలానికి కనీసం రెండు చొప్పున ఏర్పాటు చేయాలని టెస్కాబ్ ప్రయత్నాలు చేస్తోంది.
ప్యాక్స్ల ద్వారా 30 రకాల సేవలు
రైతులకు మరిన్ని సేవలు అందించడానికి ప్యాక్స్ను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నం. కేంద్రం సిఫార్సుల మేరకు ప్యాక్స్ను కామన్ సర్వీస్ సెంటర్గా మార్చి.. రైతులకు 30 రకాల సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నం. ప్రస్తుతం అవసరానికి తగిన ప్యాక్స్ లేవు. కొత్తగా మరో వంద ఏర్పాటు చేయాలని నిర్ణయించి ప్రభుత్వానికి ప్రపోజల్స్పంపాం. అనుమతి రాగానే వీటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటం.
– కొండూరి రవీందర్రావు, టెస్కాబ్ చైర్మన్
