తాగేందుకు భార్య పైసలియ్యలేదని..దుర్గం చెరువులో దూకి భర్త సూసైడ్

తాగేందుకు భార్య పైసలియ్యలేదని..దుర్గం చెరువులో దూకి భర్త సూసైడ్
  •    మాదాపూర్ పీఎస్ పరిధిలో ఘటన 

మాదాపూర్, వెలుగు : మద్యం తాగేందుకు భార్య పైసలియ్యలేదని దుర్గం చెరువులో దూకి భర్త సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన మాదాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది. ఏఎస్సై శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండలోని సంజీవ్​నగర్​కు చెందిన దారంగుల శంకర్(28) మాదాపూర్​లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్​లో ఆఫీస్ బాయ్​గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొంతకాలంగా శంకర్ మద్యానికి బానిసయ్యాడు. తాగేందుకు డబ్బులు అడుగుతూ ఇంట్లో కుటుంబసభ్యులతో ప్రతిరోజు గొడవపెట్టుకునేవాడు.

మంగళవారం రాత్రి మద్యం తాగేందుకు పైసలివ్వాలని భార్యతో గొడవపడ్డాడు. ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో అదే రోజు అర్ధరాత్రి బైక్ తీసుకుని ఇంట్లో నుంచి బయటికెళ్లాడు. మాదాపూర్​లోని కేబుల్ బ్రిడ్జి వద్దకు వచ్చిన శంకర్ తాను సూసైడ్ చేసుకుంటున్నట్లు కుటుంబసభ్యులకు వాయిస్ మెసేజ్ పంపాడు. బైక్​ను కేబుల్ బ్రిడ్జి మీద వదిలేసి దుర్గం చెరువులో దూకాడు. కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మాదాపూర్ పోలీసులు, బల్దియా డీఆర్ఎఫ్ సిబ్బంది ​బుధవారం ఉదయం నుంచి దుర్గం చెరువులో గాలించారు. గురువారం ఉదయం 11 గంటలకు శంకర్ డెడ్ బాడీని గుర్తించి చెరువులో నుంచి బయటికి తీసుకొచ్చారు. డెడ్ బాడీని ఉస్మానియాకు తరలించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.