
ఎల్ బీ నగర్, వెలుగు: భార్యను హత్య చేసిన భర్త ఆమె కరోనాతో చనిపోయిందని అందరినీ నమ్మించాడు. డెడ్ బాడీకి పోస్టుమార్టం చేయడంతో అసలు విషయం బయటపడింది. భార్యపై అనుమానంతో అతడే ఆమెను హత్య చేసి కరోనా డ్రామా ఆడినట్లు పోలీసులు తేల్చారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా పిల్లగుంట్ల తండాకు చెందిన విజయ్(26), మిర్యాలగూడకి చెందిన కవిత(21) నాలుగేండ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో జాబ్ చేసే విజయ్.. భార్యతో కలిసి వనస్థలిపురంలోని ఇంజాపూర్లో ఉంటున్నాడు. జాబ్ పోవడంతో కొంతకాలంగా విజయ్ ఆటో నడుపుతున్నాడు. కవిత ఎక్కువగా ఫోన్ మాట్లాడుతుండటంతో ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. గత నెల 18న తెల్లవారుజామున నిద్రపోతున్న కవిత మొహంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. కవిత కరోనాతో చనిపోయిందని ఆమె తల్లిదండ్రులకు చెప్పి పిల్లగుంట్ల తండాలో అంత్యక్రియలు జరిపించాడు. విజయ్పై అనుమానంతో కవిత తల్లిదండ్రులు వనస్థలిపురం ఏరియా హాస్పిటల్లో గత నెల 10న చేసిన టెస్టుల వివరాలను సేకరించారు. రిపోర్టులో కవితకు నెగిటివ్ అని ఉండటంతో ఆమె తల్లి వనస్థలిపురం పీఎస్లో కంప్లయింట్ చేసింది. పోలీసులు పిల్లగుంట్లలో పూడ్చిన డెడ్ బాడీని బయటకు తీయించి పోస్టుమార్టంకు పంపారు. కవిత ఊపిరాడక మృతి చెందినట్లు రిపోర్టులో తేలింది. భర్త విజయ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా..తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడిని రిమాండ్కి తరలించారు.