అఫ్జల్ గంజ్ పరిధిలో కుషాయిగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చోరీ కేసును చేధించారు పోలీసులు. సీసీ కెమెరాల ఆధారంగా బస్సును నాందేడ్ లో పట్టుకున్నట్లు చెప్పారు. ఈస్ట్ జోన్ డీసీపీ… రమేష్ చెప్పిన వివరాల ప్రకారం.. ‘అఫ్జల్ గంజ్ నుంచి ఏప్రిల్ 24 న రాత్రి 12 గంటల 3 నిముషాలకు బస్సు చోరీ జరిగింది. సీబీఎస్ నుండి తూప్రాన్ మీదుగా బస్సును నాందేడ్ తీసుకువెళ్లారు. నాందేడ్ కు 10 కిలోమీటర్ల దూరంలో బస్సును షెడ్ కు తీసుకెళ్లి పార్ట్స్ ను విడగొట్టారు. లక్ష రూపాయలకు ఒప్పందం చేసుకుని బస్సును షెడ్డుకు తరలించారు. ఒప్పందంలో భాగంగా రూ. 60 వేలు నిందితులు తీసుకున్నారు. వారి నుండి రూ 19వేల500 స్వాధీనం చేసుకున్నాం . ఈ చోరీ కేసులో 9 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించాం. వీరిలో ఏ1,ఏ2 ఇద్దరు అన్నదమ్ములు. హైదరాబాద్ లో పలు చోట్ల వీళ్లపై దొంగతనాల కేసులో జైలుకు వెళ్లి వచ్చారు‘ అని చెప్పారు.