- 24 గంటల సిటీగా హైదరాబాద్
- దేశంలోనే తొలి నగరంగా అభివృద్ధి చేస్తం: సీఎం రేవంత్రెడ్డి
- నైట్ టైమ్ ఎకానమీపై దృష్టి పెడ్తం.. దావోస్ వేదికపై సీఎం ప్రతిపాదన
- ప్రతీ జులైలో హైదరాబాద్లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఫాలోఅప్ సదస్సు పెట్టండి
- ‘జాయిన్ ది రైజ్’ కార్యక్రమంలో తెలంగాణ విజన్పై వివరణ
- ప్రత్యేక ఆకర్షణగా సినీ నటుడు చిరంజీవి
- మూసీ పునరుజ్జీవానికి తెలంగాణతో కలిసి పనిచేస్తాం: టాటా గ్రూప్ చైర్మన్
హైదరాబాద్, వెలుగు: దేశంలోనే 24 గంటలు పనిచేసే తొలి నగరంగా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని తెలిపారు. ఇందులో 50% కంటే ఎక్కువ గ్రీన్ కవర్ ఉంటుందన్నారు. ఏటా జులైలో హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలో-అప్ సదస్సు నిర్వహించాలని ప్రతిపాదించారు.
దావోస్లో జరిగిన ‘జాయిన్ ది రైజ్’ కార్యక్రమంలో ఈ ప్రతిపాదనకు గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్’ లక్ష్యాలను సీఎం వివరించారు. ఈ రోజుల్లో పెట్టుబడుల ఒప్పందాలు, వ్యాపార, వాణిజ్య నిర్ణయాలకు ఒక ఏడాది ఎక్కువ సమయమని అభిప్రాయపడ్డారు.
అందుకే ప్రతి ఏడాది జూలై లేదంటే ఆగస్టులో హైదరాబాద్లో ఫాలో-అప్ ఫోరం నిర్వహించాలని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రతినిధులకు సూచించారు. హైదరాబాద్ లో ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైందని, రూ.5.75 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించామని చెప్పారు.‘‘ప్రతి ఏడాది మేం ఎంవోయూలపై సంతకాలు చేయడానికి దావోస్ కు వస్తాం.. కానీ ఈసారి గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావడంతో తెలంగాణ రైజింగ్ విజన్, ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలను ప్రపంచానికి చూపించడానికి వచ్చాం” అని తెలిపారు.
జీసీసీలకు కేంద్రంగా హైదరాబాద్
గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు (జీసీసీ) హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారిందని సీఎం చెప్పారు. మూసీ నది పునరుజ్జీవనంతో పాటు రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసి నైట్ టైమ్ ఎకానమీపై దృష్టి పెడ్తామన్నారు. తెలంగాణ ఇన్నోవేషన్ హబ్, తెలంగాణ నెక్స్ట్-జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–2030 సీఎం ఈ సందర్భంగా ఆవిష్కరించారు. సమావేశంలో పాల్గొన్న మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి హైదరాబాద్ లో మెట్రో రైలు విస్తరణ, చెరువులు, కుంటల పునరుజ్జీవనం వంటి గేమ్-చేంజర్ ప్రాజెక్టులను వివరించారు.
కొత్తగా ప్రతిపాదించిన కోర్, ప్యూర్, రేర్ అర్థిక వృద్ధి జోన్ల ప్రణాళికలను ప్రస్తావించారు. తెలంగాణకు అపారమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని, టెక్నాలజీ, అనుభవం, నైపుణ్యాల పరంగా గ్లోబల్ కంపెనీల సహకారం తీసుకుంటామని తెలిపారు. ప్రముఖ నటుడు చిరంజీవి ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సీఎంతో కలిసి ఆయన విందులో పాల్గొన్నారు.
మూసీ పునరుజ్జీవానికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం: టాటా గ్రూప్ చైర్మన్ ఆసక్తి
దావోస్లో టాటా గ్రూప్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ విజన్–2047, ప్రభుత్వ విధానాలు, రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని టాటా చైర్మన్కు వివరించారు. రాష్ట్రం రూపొందించిన అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. భవిష్యత్ అవసరాలకు ప్రణాళికాబద్ధమైన ఆలోచన విధానాన్ని టాటా చైర్మన్ ప్రశంసించారు. పెట్టుబడుల కోసం కాకుండా, విధానాలు, ఫ్యూచర్ విజన్ను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ముందుకెళ్తోందని అభినందించారు.
హైదరాబాద్లోని ప్రధాన క్రీడా మైదానాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దే ఆలోచనలను టాటా గ్రూప్ చైర్మన్ తో సీఎం పంచుకున్నారు. స్పోర్ట్స్ స్టేడియం అభివృద్ధి లో భాగస్వామ్యం పంచుకునేందుకు, ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చంద్రశేఖరన్ వెల్లడించారు. దేశంలో ప్రతిభ ఉన్నా.. దానికి తగిన మౌలిక సదుపాయాలు అవసరమని అభిప్రాయపడ్డారు.యువత నైపుణ్యాల అభివృద్ధిపై కూడా చర్చించారు. హైదరాబాద్ లో చేపడుతున్న మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై టాటా చైర్మన్ ఆసక్తి చూపారు.
రాజస్థాన్, మహారాష్ట్రలో నీటి వనరుల పునరుద్ధరణలో టాటా గ్రూప్ అనుభవాన్ని గుర్తుచేస్తూ, మూసీ అభివృద్ధిలో భాగస్వామిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మూసీ నది చుట్టూ ఆర్థిక కార్యకలాపాలు పెరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో హోటళ్లు, రిసార్టులు ఏర్పాటు చేసే అంశంపై ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. మేడారం, వేములవాడ, భద్రాచలం వంటి ఆలయ ప్రాంతాల్లో హోటళ్ల ఏర్పాటుకు టాటా గ్రూప్ ఆసక్తి చూపింది.
శ్రీశైలం రహదారి వెంబడి అంతర్జాతీయ స్థాయి రిసార్ట్ ఏర్పాటుపై సానుకూలంగా స్పందించింది. ఏఐ డేటా సెంటర్లు, సెమీకండక్టర్, ఈవీ తయారీ రంగాల్లో తెలంగాణలో కొత్త పరిశ్రమలు నెలకొల్పే అవకాశాలపై టాటా చైర్మన్ ఆసక్తి ప్రదర్శించారు.
