
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ బోనాల ఉత్సవాల్లో అమ్మవారి అంబారీ ఊరేగింపునకు అనుమతి లభించింది. ఈసారి కూడా కర్నాటక నుంచి ఏనుగు రానున్నది. ఊరేగింపు కోసం తుంకూరులోని శ్రీ కరిబసవ స్వామి మఠం నుంచి తెలంగాణకు 33 ఏండ్ల ఏనుగు(లక్ష్మి)ను తరలించేందుకు అక్కడి అటవీ శాఖ ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ తెలిపింది.
అటవీ చట్టాల ప్రకారం అన్ని జాగ్రత్తలతో జులై 12న ఏనుగును తీసుకొచ్చి, పోషణ, విశ్రాంతి, వైద్య బాధ్యతలు చేపట్టనున్నట్లు పేర్కొంది. జులై 14న సికింద్రాబాద్ ఉజ్జయిని, 20న సబ్జీ మండిలోని నల్లపోచమ్మ, మహంకాళి దేవాలయం, 21న అక్కన్న మాదన్న ఆలయాలకు సంబంధించి అమ్మవారి ఊరేగింపులో లక్ష్మి పాల్గొంటుంది. అనంతరం 23న ఏనుగును కర్నాటకకు తలించనున్నారు.