బషీర్బాగ్, వెలుగు: అక్రమ ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్రచారాలను అరికట్టడంలో హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. నెల రోజులుగా డిజిటల్ మానిటరింగ్, ఇంటెలిజెన్స్ ఆధారిత ట్రాకింగ్ నిర్వహించి, సోషల్ మీడియాలో చురుకుగా పనిచేస్తున్న 124 ప్రొఫైల్లను గుర్తించి తొలగించినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ వి.అరవింద్ బాబు తెలిపారు.
వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో ఈ ప్రొఫైల్లు భారతీయులను లక్ష్యంగా చేసుకుని పలు ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్లు, వెబ్సైట్లను ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. యువతను ఆకర్షించేలా భారీ లాభాలు, బోనస్లు, రిఫరల్ కమిషన్లు అందుతాయని నమ్మించి ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు చెప్పారు. అలాంటి 124 ప్రొఫైల్లను గుర్తించి తొలగించామని, ప్రొఫైల్స్కు సంబంధించిన వ్యక్తులు, ఆర్థిక లావాదేవీలను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
