
- డెంగ్యూ, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టండి
- ఉన్నతస్థాయి సమీక్షంలో సీఎం
హైదరాబాద్, వెలుగు: కోర్ అర్బన్ రీజియన్కు సంబంధించి ప్రత్యేకంగా సమగ్ర పాలసీ తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదే శించారు. కోర్ అర్బన్తో పాటు సెమీ అర్బన్, రూరల్ ఏరియాలపైనా ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలన్నారు. బుధవారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అధికారు లతో కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్ నగరంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతి, రాబోయే వర్షాకాల సన్నద్ధతపై ఈ సమావేశంలో చర్చించారు. సిటీ అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తి వివరాలను అధికారులు అందించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్లో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం సూచించారు. రాబోయే 25 ఏండ్లను దృష్టిలో పెట్టుకొని, పెరుగుతున్న నగర జనాభా అవసరాలకు తగ్గట్టు తాగునీటి సరఫరా, డ్రైనేజీ, రోడ్లు, మెట్రో కనెక్టివిటీ, ఎలివేటెడ్ కారిడార్లకు సంబంధించి సమగ్ర ప్రణాళికలతో రావాలని అధికారులను ఆదేశించారు.
శానిటేషన్ విషయంలో నిర్లక్ష్యం వద్దు
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న తాగునీటి సరఫరా, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పనుల పురోగతిని సీఎం రేవంత్రెడ్డికి అధికారులు వివరించారు. అసంపూర్తిగా ఉన్న పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో నగరంలో శానిటేషన్ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దని ఆయన స్పష్టం చేశారు. డెంగ్యూ, చికున్ గున్యా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి, ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షాకాలంలో డ్రైనేజీ ఓవర్ఫ్లో కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, తాగునీరు కలుషితం కాకుండా చూడటంతో పాటు దోమల నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.