రేపు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు

రేపు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్: శ్రీరామనవమి సందర్భంగా బుధవారం (ఏప్రిల్ 17) హైదరాబాద్  నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు  అమలులో ఉంటాయని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి  చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి సీతారాంబాగ్ ఆలయం నుంచి శ్రీరామ శోభయాత్ర ప్రారంభమై.. కోటిలోని హనుమాన్ వ్యాయామ శాల మైదానంలో రాత్రి 11.30 గంటలకు  ముగుస్తుంది. ఈ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ తెలిపారు. 

ప్రధాన ఊరేగింపు సీతారాంబాగ్  ఆలయం నుంచి రామకోటిలోని హనుమాన్ వ్యాయామ శాల స్కూల్ వరకు జరుగుతుంది. బోయిగూడ కమాన్, జాలి హనుమాన్, మంగ ళహాట్ పీఎస్ రోడ్, పురాణాపూల్, గాంధీ విగ్రహం, ధూల్పేట్, చుడిబజార్, బేగంబజార్, జుమ్మేరాత్ బజార్, బేగం బజార్ చత్రి, బర్తన్ బజార్, శంకర్ షేర్ హోటల్, గురుద్వారా, సిద్ధి అంబర్ బజార్, గౌలిగూడ చమన్, పుత్లిబౌలి ఎక్స్ రోడ్స్, సుల్తాన్ బజార్, కోఠీల మీదుగా శ్రీరామ శోభయాత్ర సాగుతుంది. ఈ ప్రయాణంలో చిన్న చిన్న ఊరేగింపులు వివిధ పాయింట్ల వద్ద ప్రధాన ఊరేగింపులో కలవనున్నాయి. 

శ్రీరామ శోభయాత్ర ఈ ప్రాంతాల నుంచి వెళుతున్న సమయంలో ఆయా ప్రదేశాలలో అవాంఛనీయ సంఘటనలు, అంతరాయాలు కలగకుండా ట్రాఫిక్ ను మళ్లించనున్నారు. ఇది దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణించడానికి సిద్ధంగా కావాలని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.