
హైదరాబాద్, వెలుగు: దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న టాప్ టెన్ జిల్లాల్లో హైదరాబాద్ ఏడో స్థానంలో ఉంది. శుక్రవారం సాయంత్రం నాటికి దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో 2.7 శాతం హైదరాబాద్కు చెందినవే ఉన్నాయి. కరోనా కేసుల లోడ్ ఎక్కువగా ఉన్న 27 జిల్లాల వివరాలను నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ శుక్రవారం రాత్రి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా ముంబైలో 13.8 శాతం, ఢిల్లీలో 11.6 శాతం, అహ్మదాబాద్లో 7.7, ఇండోర్ 4.5, జైపూర్ 3.8, పుణెలో 3.5, హైదరాబాద్ 2.7, సూరత్ 2.2, థానేలో 2 శాతం కేసులు నమోదయ్యాయని తెలిపారు. పాజిటివ్ కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్, టెస్టింగ్ ద్వారా ఈ జిల్లాల్లో కరోనాను కంట్రోల్ చేయాల్సి ఉందన్నారు.
రాష్ర్టంలో సగానికిపైగా హైదరాబాద్లోనే..
రాష్ర్టంలో కరోనా కేసుల్లో 55.9% హైదరాబాద్లోనే ఉన్నాయని అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. మొత్తం 990 కేసుల్లో దాదాపు 570 కేసులు హైదరాబాద్లోనే రికార్డయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం కూడా హైదరాబాద్పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక్కడ లాక్డౌన్ ఉల్లంఘనలు జరుగుతుండడంతో ఓ బృందాన్ని పరిశీలన కోసం పంపింది. ప్రస్తుతం ఆ టీమ్ హైదరాబాద్లో పర్యటిస్తోంది.