హైదరాబాదీలకు బేఫికర్.. పక్కా రెయిన్ అప్డేట్స్ ఇచ్చేందుకు హైడ్రా యాక్షన్ స్టార్ట్

హైదరాబాదీలకు బేఫికర్.. పక్కా రెయిన్ అప్డేట్స్ ఇచ్చేందుకు హైడ్రా యాక్షన్ స్టార్ట్

హైదరాబాద్ సిటీ, వెలుగు: మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్(ఎంఈటీ) జులై1 నుంచి ఫీల్డ్‎లోకి రానున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగానాథ్ తెలిపారు. టెండ‌ర్ల ప్రక్రియ‌ త‌ర్వాత ఎంపిక చేసిన ఎంఈటీల‌కు స‌ర్కిళ్లవారీగా విధులను హైడ్రా అప్పగించింది. జీహెచ్ఎంసీలోని 30 స‌ర్కిళ్లలో మొత్తం 150 టీమ్‌లు ప‌నిచేయ‌నున్నట్లు రంగనాథ్​ తెలిపారు. విధి నిర్వహ‌ణ‌లో ఎక్కడా ఎలాంటి అల‌స‌త్వం ప్రద‌ర్శించ‌వ‌ద్దని ఈ బృందాల‌కు సూచించారు.

ఎక్కడ నీరు నిలుస్తుందో ముందుగానే ఒక అంచ‌నాకు వ‌చ్చి స‌మ‌స్య ప‌రిష్కారానికి చ‌ర్యలు తీసుకోవాలన్నారు. ఎంఈటీ బృందాల‌కు హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు కూడా స‌హ‌క‌రిస్తాయ‌ని, స‌మ‌న్వయంతో ప‌ని చేయాల్సిన‌వ‌స‌రం ఉంద‌ని చెప్పారు. వ‌ర‌ద నివార‌ణ చ‌ర్యల‌కు అవ‌స‌ర‌మైన ప‌నిముట్లను అంద‌జేస్తుంద‌ని, అలాగే సిబ్బందికి హైడ్రా శిక్షణ కూడా ఇస్తుంద‌న్నారు. 

ముందస్తు వర్ష సమాచారం ఇచ్చేందుకు కసరత్తు

వ‌ర్షానికి సంబంధించి స‌రైన స‌మాచారం ఇచ్చేందుకు హైడ్రా ప్రయ‌త్నిస్తోంది. ఇందుకు గాను వివిధ శాఖ‌ల‌తో స‌మ‌న్వయం కుదుర్చుకునే ప‌నిలో నిమ‌గ్నమైంది. ఈ క్రమంలో ‘ప‌ట్టణ ప్రాంతాల్లో వాతావ‌ర‌ణ అంచ‌నా, ప‌ర్యవేక్షణ’ అనే అంశంపై శ‌నివారం హైడ్రా  ఆఫీసులో  ఓ స‌ద‌స్సును నిర్వహించింది. వ‌ర్షానికి సంబంధించి స‌రైన స‌మాచారం ముందుగానే న‌గ‌ర ప్రజ‌ల‌కు అందించ‌డానికి అనుస‌రించాల్సిన ప‌ద్ధతుల‌పై చ‌ర్చించింది.   

ఏయే ప్రాంతాల్లో, ఎప్పుడు వ‌ర్షం ప‌డుతోందని ఎంత పడుతుందనే క‌చ్చిత‌మైన స‌మాచారం ప్రజ‌ల‌కు చేర‌వేయాల్సిన అవ‌స‌రం ఉందని, ఇందుకు ఏం చేద్దామనే దానిపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చర్చించారు. హైడ్రా, వాతావ‌ర‌ణ శాఖ‌(ఐఎండీ), తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేష‌న్స్ సెంట‌ర్‌, తెలంగాణ స్టేట్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ, నేష‌న‌ల్ రిమోట్ సెన్సింగ్ సెంట‌ర్‌, ఐఐటీ హైద‌రాబాద్‌తో క‌లిసి ఒక వ‌ర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని హైడ్రా క‌మిష‌న‌ర్   ఏవీ రంగ‌నాథ్  నిర్ణయించారు.

న‌గ‌రంలో దాదాపు 157 ఆటోమేటిక్ వెద‌ర్ స్టేష‌న్లున్నాయ‌ని,  వీటి సంఖ్యను పెంచుకోవాల్సి ఉంద‌న్నారు. ప్రభుత్వ కార్యాల‌యాల‌ను ఇందుకు వేదిక‌లు చేసుకోవాల‌ని సూచించారు. ఐఎండీ తెలంగాణ డైరెక్టర్  నాగ‌ర‌త్న, టీజీడీపీఎస్ క‌న్సల్టెంట్  రామారావు, ఐఎండీ  శ్రీ‌ధ‌ర్‌,  ఎన్ఆర్ఎస్ సీ కి చెందిన  న‌రేంద్ర పాల్గొని ప‌లు సూచ‌న‌లు చేశారు.