
- ప్రమాదాలు జరిగితే ఎవరిది బాధ్యత
- ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండా ఆసుపత్రికి లైసెన్స్ ఎలా వచ్చింది?
- ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని శంకర్స్ ఆసుపత్రిని తనిఖీ చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
ముషీరాబాద్, వెలుగు: ఆర్టీసీ క్రాస్ రోడ్డులోనీ డాక్టర్ శంకర్స్ ఆసుపత్రిని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం తనిఖీ చేశారు. భవన నిర్మాణంలో కనీస నిబంధనలు పాటించలేదని, నిర్మాణ సమయంలో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు అంతస్తులకు అనుమతి తీసుకుని ఆరు అంతస్తులు, అదనంగా సెల్లార్ ఎలా నిర్మిస్తారని ఆసుపత్రి యజమాని డాక్టర్ ను ప్రశ్నించారు. అనుమతులు లేకుండా, రూల్స్పాటించకుండా నిర్మాణం చేపడితే మీరేం చేస్తున్నారని టౌన్ ప్లానింగ్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు.
డాక్టర్ శంకర్స్ ఆసుపత్రి బిల్డింగ్నిర్మాణంలో నిబంధనల ఉల్లంఘనపై స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా రంగనాథ్స్పందించారు. శుక్రవారం ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఓ వైపు 10 అడుగులు, మరోవైపు 15 అడుగుల దారి ఉన్నచోట ఇన్ని అంతస్తులు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. రోడ్లను ఆక్రమించి నాలుగు అంతస్తుల నిర్మాణానికి అనుమతులు తీసుకుని 6 అంతస్తులు ఎలా నిర్మిస్తారంటూ డాక్టర్శంకర్ పై మండిపడ్డారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ నిలదీశారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండా ఆసుపత్రికి ఏవిధంగా లైసెన్స్ మంజూరు చేశారో తేల్చాలన్నారను. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ సిటీ ప్లానర్ శ్రీనివాస్కు సూచించారు.