- బఫర్ జోన్లో నిర్మాణాలు జరుగుతున్నట్లు అనుమానంతోనే తహసీల్దార్కు లేఖ రాశామని వెల్లడి
హైదరాబాద్ సిటీ, వెలుగు: మూసీ నది బఫర్ జోన్లో ఆదిత్య బిల్డర్స్ నిర్మాణాల విషయంలో హైడ్రాపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. నిర్మాణాల విషయంలో హైకోర్టు అనుమతులు పునరుద్ధరించినా.. మరోసారి నిర్ధారించుకుందామనే ఉద్దేశంతోనే గండిపేట తహసీల్దార్కు లేఖ రాశామని చెప్పారు.
శాటిలైట్ ఇమేజీలను పరిశీలిస్తే.. మూసీ నది బఫర్ జోన్లో ఆదిత్య బిల్డర్స్ నిర్మాణాలు జరుగుతున్నట్లు అనుమానాలు రావడంతోనే క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరణ ఇవ్వాలని రెవెన్యూ ఆఫీసర్లను వివరణ కోరామని వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు వారి నుంచి స్పందన రాలేదన్నారు.
గతంలోనే ఈ విషయంలోనే కవితకు వివరణ ఇచ్చామని, మరోసారి ఆమె హైడ్రాపై ఆరోపణలు చేయడంతో ఇప్పుడు కూడా స్పష్టత ఇస్తున్నట్లు చెప్పారు. హైడ్రాపై కవిత ఆరోపణలపై రంగనాథ్ ఆదివారం ఒక ప్రటకనలో స్పందించారు. మూసీ నది తీరంలో ఆదిత్య బిల్డర్స్కు నిర్మాణ అనుమతులు ఇవ్వడం.. తర్వాత రద్దు చేయడం గత ప్రభుత్వ హయాంలోనే జరిగాయన్నారు.
దీనినే ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగించిందని తెలిపారు. ఈ రద్దుపై ఆదిత్య బిల్డర్స్ హైకోర్టును ఆశ్రయించడం.. తాము బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టడం లేదని, వెనక్కి జరిగి నిర్మాణాలు చేస్తున్నామని ఆధారాలతో కోర్టుకు నివేదించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని నిర్ధారించాలని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను హైకోర్టు ఆదేశించిందని చెప్పారు. ఈ రెండు శాఖలు ఇచ్చిన నివేదిక మేరకు హైకోర్టు నిర్మాణ అనుమతులను పునరుద్ధరించిందని, దీంతో నిర్మాణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
