అబ్దుల్లాపూర్మెట్, వెలుగు: నగర శివారు పెద్ద అంబర్పేట్ కుంట్లూరు పరిధిలోని అంజనాద్రి నగర్లో రోడ్లు, ప్లాట్లను కబ్జా చేశారన్న ఫిర్యాదుపై హైడ్రా అధికారులు శుక్రవారం చర్యలు చేపట్టారు. సర్వే నంబర్ 204, 208లోని రోడ్లను ‘గురు కృష్ణ డెవలప్మెంట్’ వారు ఆక్రమించారని ప్లాట్ల ఓనర్ అసోసియేషన్ సభ్యులు ఇటీవల కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేశారు.
దీనిపై అధికారులు విచారణ జరిపి ఆక్రమణలు జరిగినట్లు ధ్రువీకరించారు. కమిషనర్ ఆదేశాల మేరకు సీఐ సైదులు నేతృత్వంలోని బృందం శుక్రవారం ఆక్రమణలను తొలగించి రోడ్డును పునరుద్ధరించారు. సకాలంలో స్పందించి తమ సమస్యను పరిష్కరించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ప్లాట్ల యజమానులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
