కబ్జా చెర నుంచి పార్కును కాపాడిన హైడ్రా

కబ్జా చెర నుంచి పార్కును కాపాడిన హైడ్రా

శామీర్ పేట, వెలుగు: మేడ్చల్ జిల్లా తూముకుంట‌లో కబ్జాకు గురైన పార్కును హైడ్రా కాపాడింది. దాదాపు 2 వేల గ‌జాల విస్తీర్ణంలోని పార్కును, పక్క స్థలం వ్యక్తి క‌బ్జా చేశారంటూ నార్త్ పార్క్​అవెన్యూ వెంచ‌ర్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టిన అధికారులు శనివారం చర్యలు తీసుకున్నారు. తూముకుంటలోని సర్వే నంబర్లు 97, 108, 109లో మూడున్నర ఎక‌రాల్లో 10 ప్లాట్లతో  1997లో నార్త్ పార్క్ అవెన్యూ వెంచ‌ర్‌ వేశారు. 

ఇందులోని 2 వేల గ‌జాల స్థలంలో పార్కు ఏర్పాటు చేశారు. కాగా, కొన్నేళ్లు కింద పార్కు స్థలం తనదంటూ.. అక్కడ ఉన్న స్విమ్మింగ్​పూల్​తోపాటు ప్రహరీని పక్క స్థలం అతను కూల్చేశాడు. ఇటీవల నార్త్ పార్క్​అవెన్యూ వెంచ‌ర్ ప్రతినిధుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు, మున్సిప‌ల్ అధికారుల‌తో కలిసి విచారణ చేపట్టారు. సదరు స్థలం నార్త్ పార్క్​అవెన్యూ వెంచ‌ర్​లో భాగమేనని నిర్ధారించుకుని శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమించి నిర్మించిన షెడ్డుతోపాటు, ప్రహరీని తొలగించారు.