
శామీర్ పేట, వెలుగు: మేడ్చల్ జిల్లా తూముకుంటలో కబ్జాకు గురైన పార్కును హైడ్రా కాపాడింది. దాదాపు 2 వేల గజాల విస్తీర్ణంలోని పార్కును, పక్క స్థలం వ్యక్తి కబ్జా చేశారంటూ నార్త్ పార్క్అవెన్యూ వెంచర్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టిన అధికారులు శనివారం చర్యలు తీసుకున్నారు. తూముకుంటలోని సర్వే నంబర్లు 97, 108, 109లో మూడున్నర ఎకరాల్లో 10 ప్లాట్లతో 1997లో నార్త్ పార్క్ అవెన్యూ వెంచర్ వేశారు.
ఇందులోని 2 వేల గజాల స్థలంలో పార్కు ఏర్పాటు చేశారు. కాగా, కొన్నేళ్లు కింద పార్కు స్థలం తనదంటూ.. అక్కడ ఉన్న స్విమ్మింగ్పూల్తోపాటు ప్రహరీని పక్క స్థలం అతను కూల్చేశాడు. ఇటీవల నార్త్ పార్క్అవెన్యూ వెంచర్ ప్రతినిధుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు, మున్సిపల్ అధికారులతో కలిసి విచారణ చేపట్టారు. సదరు స్థలం నార్త్ పార్క్అవెన్యూ వెంచర్లో భాగమేనని నిర్ధారించుకుని శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమించి నిర్మించిన షెడ్డుతోపాటు, ప్రహరీని తొలగించారు.