గేట్లు, బండరాళ్లు పెట్టి రోడ్డు ఆక్రమణ.. రంగంలోకి హైడ్రా.. అడ్డంకుల తొలగింపు

గేట్లు, బండరాళ్లు పెట్టి రోడ్డు ఆక్రమణ.. రంగంలోకి హైడ్రా.. అడ్డంకుల తొలగింపు
  • ఎన్ హెచ్44కు రోడ్డు క్లియరెన్స్

శామీర్ పేట, వెలుగు: దేవరయాంజల్, కండ్లకోయ ప్రజలు సులభంగా ఎన్​హెచ్ 44కు చేరుకునే అవకాశాన్ని హైడ్రా కల్పించింది. ఈ రెండు గ్రామాల మధ్య ఉన్న రహదారిని బండకుంట నరసింహారెడ్డి అనే వ్యక్తి గేట్లుపెట్టి, రోడ్డును కొంత మేర తవ్వేసి ఆటంకాలు సృష్టించగా, బుధవారం వాటిని హైడ్రా తొలగించింది. వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట మండలం దేవరయాంజల్,  కండ్లకోయ135, 136 సర్వే నంబర్లలో జిల్లా న్యాయస్థాన సముదాయానికి కొంత స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్, మేడ్చల్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ నిర్మాణానికి కూడా కొంత స్థలాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. 

వీటి నిర్మాణం జరగాల్సి ఉండగా.. ఇప్పటికే ఈ మార్గంలో కొన్ని పరిశ్రమలు కూడా ఉన్నాయి. వీటితో పాటు కండ్లకోయ, దేవరయాంజల్ నివాసితులు కూడా ఇదే రోడ్డును వినియోగిస్తున్నారు. ప్రస్తుతం మట్టి రోడ్డు ఉండగా, త్వరలో 40 అడుగుల విస్తీర్ణంలో రోడ్డు నిర్మించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రెండు గ్రామాల మధ్య సులభంగా ఉండే రోడ్డును నరసింహ రెడ్డి అనే వ్యక్తి ఆక్రమించాడు. ఇదే విషయంపై స్థానికులు హైడ్రాకు కంప్లైంట్ చేశారు. 

క్షేత్ర స్థాయిలో పరిశీలించాక అక్కడ నిర్మించిన గేట్లతో పాటు, రోడ్డుమీద అడ్డంగా వేసిన బండరాళ్లను హైడ్రా తొలగించింది. కందకం మాదిరి తవ్విన చోట మట్టిని నింపి రాకపోకలను పునరుద్ధరించింది. గూండాగిరితో రాకపోకలకు అంతరాయం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా హైడ్రాను స్థానికులు కోరారు. ఫిర్యాదుచేసిన వారం రోజుల్లోనే ఆటంకాలను తొలగించిన హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు.