హైదరాబాద్ అంబర్పేట్ గోల్నాక సమీపంలో మూసీ నదిలో పడిపోయిన ఓ మహిళను హైడ్రా టీం సేఫ్ గా రక్షించింది. అసలేం జరిగిందంటే.. భాగ్యనగర్ ప్రాంతానికి చెందిన ఇందిర అనే మహిళ మే 8న రాత్రి ప్రమాదవశాత్తు మూసీ నదిలో జారిపడిపోయింది. ఒడ్డుకు వచ్చే మార్గం లేకపోవడం, చుట్టూ చెట్లు అడ్డంగా ఉండటంతో ఆమె రాత్రంతా మృత్యువుతో పోరాడుతూ నీటిలోనే చిక్కుకుపోయింది.
మే 9న ఉదయం 10 గంటల సమయంలో స్థానికులు ఆమెను గుర్తించి, వెంటనే హైడ్రా కంట్రోల్ రూమ్కు సమాచారం అందించారు. ఉదయం 10:51 నిమిషాలకు కాల్ రాగానే అప్రమత్తమైన DRF బృందం.. కేవలం 16 నిమిషాల్లోనే అంటే 11:07 గంటలకే ఘటనా స్థలానికి చేరుకుంది.హైడ్రా సిబ్బంది పెద్ద నిచ్చెన సహాయంతో మూసీలోకి దిగి ఇందిరను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. రెస్క్యూ జరుగుతున్న సమయంలోనే ఫైర్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకుని సహకరించారు.
►ALSO READ | మీకు హ్యాట్సాఫ్ : ఈ అద్భుతమైన బ్రిడ్జి మలుపు కట్టిన ఇంజినీర్లను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకున్నారు..!
సురక్షితంగా ఒడ్డుకు చేరిన ఇందిర.. తాను ప్రమాదవశాత్తు జారిపడ్డానని, రాత్రంతా నరకం చూశానని కన్నీటి పర్యంతమయ్యారు. భర్త లేని ఆమె, ఇద్దరు పిల్లలతో జీవిస్తున్నానని చెప్పింది. అనంతరం ఆమెను తన కుటుంబ సభ్యులకు అప్పగించింది హైడ్రా. టైంకు స్పందించి మహిళను కాపాడిన హైడ్రా DRF బృందంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
