లిక్కర్ దందా చేసే స్నేహితులు ఉండరా..? : ఎమ్మెల్యే సంజయ్ కుమార్

లిక్కర్ దందా చేసే స్నేహితులు ఉండరా..? : ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యేనని, లిక్కర్ దందా చేసే స్నేహితులు ఉండరా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారని సంజయ్ కుమార్ ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిర్దోషిగా బయటకు వస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తాను ఓ ఎమ్మెల్యేగా అభివృద్ధి చేస్తున్నా.. తనను విమర్శిస్తున్నారన్నారు. తనకు 200 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నదని, తాను కాంట్రాక్టర్ దగ్గర 30% కమిషన్ తీసుకుంటానని కాంగ్రెస్ నాయకులు ఛార్జ్ షీట్ వేశారని సంజయ్ కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ తరహా రాజకీయం జగిత్యాలలో తానెప్పుడూ చూడలేదని ఆయన చెప్పారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశంలోనే హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా ఈ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రమేయం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆమెను ఇటీవలే ఈడీ అధికారులు విచారించారు. తన ఫోన్లను ధ్వంసం చేశారన్న వార్తలపైనా స్పందించిన కవిత.. ఇటీవలే తన ఫోన్లను చూపించి అందరికీ షాక్ ఇచ్చారు. మరో పక్క ప్రతిపక్షాలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.