
బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘సైంధవ్’. వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రంలో నవాజుద్దీన్ కీలక పాత్ర పోషించారు. జనవరి 13న సినిమా విడుదలవుతున్న సందర్భంగా నవాజుద్దీన్ మాట్లాడుతూ ‘వెంకటేష్ గారి 75వ సినిమాలో నటించడం గ్రేట్ ఎక్స్పీరియెన్స్. ఇందులో యూనిక్ క్యారెక్టర్ చేశా. నేనెప్పుడూ హీరో, విలన్ పాత్ర అని చూడను. పాత్ర ఆసక్తికరంగా ఉందా లేదా అనేదే ముఖ్యం. కొన్ని సార్లు పాజిటివ్ రోల్స్ కంటే నెగిటివ్ రోల్స్లో పెర్ఫార్మ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటిదే ఇందులో దక్కింది.
నాది హైదరాబాదీ పాత్ర. తెలుగు, హిందీ కలిపి మాట్లాడాలి. నేను డబ్బింగ్ చెబితేనే న్యాయం జరుగుతుంది అనిపించింది. అందుకే తెలుగు నేర్చుకుని భాషను, భావాన్ని అర్ధం చేసుకొని డబ్బింగ్ చెప్పా. నా నటనకు వేరే ఎవరో డబ్బింగ్ చెప్పడం కూడా నాకు ఇష్టం ఉండదు. పాత్రలో ఆ డెప్త్ కూడా రాదు. హెవీ యాక్షన్ సీక్వెన్స్లు ఉన్న చిత్రం కావడంతో ఆ సీన్స్ చేయడం కాస్త చాలెంజింగ్గా అనిపించింది. చాలా కూల్గా, ప్రశాంతంగా కనిపించే వెంకటేష్ గారు.. యాక్షన్ సీన్స్లో మాత్రం డూప్ కూడా లేకుండా చాలా రిస్క్లు తీసుకున్నారు. కొత్త అవతార్లో వెంకీ గారిని చూస్తారు. ఈ జర్నీలో ఆయన నుంచి చాలా నేర్చుకున్నా’ అని అన్నాడు.