
హైదరాబాద్,వెలుగు : సైబ ర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయని డీజీపీ రవిగుప్తా పేర్కొన్నారు. కర్నాటక మాజీ డీజీపీ కూడా సైబర్ క్రిమినల్స్ బాధితుడేనని తెలిపారు. తనకు కూడా కాల్స్, సోషల్ మీడియాలో లింక్స్ వచ్చాయని చెప్పారు. ఆన్లైన్ క్రైమ్స్ అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన తీసుకురావడం ఒక్కటే మార్గమని స్పష్టంచేశారు. టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీఎస్సీఎస్బీ) ఆధ్వర్యంలో శుక్రవారం సైబర్ నేరాలు,సైబర్ సేఫ్టీపై వర్క్షాప్ జరిగింది. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన వర్క్షాప్లో పాల్గొని డీజీపీ రవిగుప్తా సైబర్ క్రైమ్స్ పై పలు సూచనలు చేశారు. ఇందులో సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్,హైదరాబాద్ సీపీ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
యూ ట్యూబ్లో లైక్ క్లిక్ చేయమని..
విద్యావంతులే ఎక్కువగా సైబర్ క్రైమ్స్ బారిన పడుతున్నారని చెప్పారు. ఓ రోజు ఎయిర్ పోర్టులో ఉండగా తనకు కూడా సైబర్ క్రిమినల్స్ నుంచి కాల్స్ వచ్చాయని, యూట్యూబ్ లో వీడియోస్కి లైక్ చేస్తే డబ్బులు ఇస్తామని చెప్పారని గుర్తుచేశారు. అనుమానం వచ్చి వాడని సెకండ్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇచ్చానని చెప్పారు. రూ.150 డిపాజిట్ చేశారని అకౌంట్ హ్యాక్ చేసేందుకు ఇలా చేశారని తెలిపారు. ఇలాంటివి స్మార్ట్ఫోన్ యూజర్స్కి నిత్యం ఎదురవుతూనే ఉంటాయని చెప్పారు. ఫోన్లో యాప్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు, పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
60 శాతం మందికి అవగాహన లేదు : హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి
సిటీ కమిషనరేట్ పరిధిలో ప్రతిరోజు 20కి పైగా సైబర్ క్రైమ్స్ కేసులు నమోదవుతున్నాయని సీపీ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఇందుకు 60 శాతం మంది ప్రజల్లో అవగాహన లేకపోవడమేనని కారణమని పేర్కొన్నారు. అవేర్ నెస్ చేసేందుకే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి కూడా సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టారని ఆదేశించారని తెలిపారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో దేశంలో నోడల్ ఆఫీస్గా నిలిచిందని బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ తెలిపారు.1930 కాల్సెంటర్ మంచి ఫలితాలను ఇస్తుందని వివరించారు. బ్యూరో ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు 90 వేల కాల్స్ వచ్చాయని చెప్పారు. త్వరలోనే బల్క్ ఎస్ఎమ్ఎస్ల ద్వారా ప్రజల్లో అవగాహన తీసుకొస్తామని చెప్పారు.