Sourav Ganguly: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీని క్రమంగా భారత జాతీయ జట్టుకు దూరం చేస్తుండటంపై బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఇండియన్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తీవ్రంగా మండిపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్లో 10 వేలకు పైగా పరుగులు చేసిన తననే ఏడాది పాటు జట్టు నుంచి పక్కన పెట్టారని గుర్తు చేస్తూ, షమీ డ్రాప్ చేయడంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
షమీ ఆటపై దాదా షాకింగ్ కామెంట్స్:
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజయం తర్వాత షమీకి భారత జట్టులో ఇప్పటి వరకు చోటు దక్కలేదు. దేశవాళీ టోర్నీల్లో నిలకడగా రాణిస్తున్నప్పటికీ సెలెక్టర్లు పట్టించుకోకపోవడంపై గంగూలీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో 10,000+ పైగా పరుగులు చేసిన నాకే ఏడాది పాటు జట్టులో చోటు దక్కలేదని పేర్కొన్నాడు. ఆ తర్వాత పోరాడి తిరిగొచ్చాను.. కానీ ఇప్పుడు షమీని ఎందుకు ఎంపిక చేయడం లేదో నాకు తెలియదు కానీ, అతని సామర్థ్యంపై నాకు పూర్తి నమ్మకముందని దాదా వ్యాఖ్యానించాడు. అయితే వచ్చే ఏడాది జరిగే 2027 వన్డే ప్రపంచకప్లో షమీ ఆడతాడా లేదా అనేదానిపై ఇప్పుడే కచ్చితంగా ఏమీ చెప్పలేమని సౌరవ్ స్పష్టం చేశాడు.
టెస్టుల్లోకి ఇషాన్ కిషన్ రీ-ఎంట్రీ ఖాయం:
దులీప్ ట్రోఫీ ఫైనల్లో 270 పరుగుల ఊచకోతతో ఈస్ట్ జోన్కు 13 ఏళ్ల తర్వాత టైటిల్ అందించిన కెప్టెన్ ఇషాన్ కిషన్ను సౌరవ్ గంగూలీ ప్రత్యేకంగా కొనియాడాడు. కిషన్తో తాను ఫోన్లో మాట్లాడానని, అన్ని ఫార్మాట్ల ఫైనల్స్లోనూ అతను అద్భుతంగా రాణిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. త్వరలోనే ఇషాన్ భారత టెస్ట్ టీమ్లోకి రీ-ఎంట్రీ ఇస్తాడని దాదా ఆశాభావం వ్యక్తం చేశాడు.
చెపాక్లో ఈస్ట్ జోన్ చారిత్రాత్మక విజయం:
* ఈస్ట్ జోన్ 1వ ఇన్నింగ్స్: 708/10 (ఇషాన్ కిషన్ 270, కుమార్ కుశాగ్రా 101)
* సౌత్ జోన్ 1వ ఇన్నింగ్స్: 368/10 (తిలక్ వర్మ 99, దేవదత్ పడిక్కల్ 62)
* ఈస్ట్ జోన్ 2వ ఇన్నింగ్స్: 388/7 డిక్లేర్డ్ (ఖురైషి 116 నాటౌట్, ఇషాన్ కిషన్ 80)
* ఫలితం: మ్యాచ్ డ్రా (తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఈస్ట్ జోన్ విజేత)
