మైలార్‌దేవ్‌పల్లిలో విషాదం.. వేడి నీళ్ల బకెట్‌లో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి

మైలార్‌దేవ్‌పల్లిలో విషాదం.. వేడి నీళ్ల బకెట్‌లో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి

హైదరాబాద్: మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వేడి నీళ్ల బకెట్‌లో ప్రమాదవశాత్తూ పడి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది.  పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఉపాధి నిమిత్తం మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని ప్రగతినగర్‌లో నివాసముంటోంది. చిన్నారి తల్లి ఓ కంపెనీలో పనిచేస్తోంది.

రోజువారీ పనిలో భాగంగా పని ముగించుకుని ఇంటికి వచ్చిన తల్లి స్నానం చేసేందుకు బకెట్‌లో వాటర్ హీటర్ పెట్టి నీటిని వేడి చేస్తోంది. అదే సమయంలో ఆమెకు ఫోన్ రావడంతో కొద్దిసేపు బయటకు వెళ్లింది. ఇంట్లోనే ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారి మానస ప్రమాదవశాత్తూ వేడి నీళ్లతో ఉన్న బకెట్‌లో పడిపోయింది.

ALSO READ ; కూకట్ పల్లి KPHBలో భారీ చిట్ ఫండ్ మోసం.. 

వేడి నీళ్ల కారణంగా చిన్నారి మానస తీవ్రంగా గాయపడింది. వెంటనే కుటుంబ సభ్యులు చిన్నారిని చికిత్స  కోసం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ.. పరిస్థితి విషమించడంతో చిన్నారి మృతి చెందింది.చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో ప్రగతినగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.