ఇండిపెండింట్‌గానే పోటీ చేస్తా..

ఇండిపెండింట్‌గానే పోటీ చేస్తా..

I will content as Independent: Naresh Jadhavగత ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్ సభ స్ధానానికి పోటీచేసి ఓటమి పాలైన కాంగ్రెస్ నేత నరేష్ జాదవ్.. ఈసారి కూడా అదే స్థానం నుంచి టికెట్ ఆశించారు. అయితే అధిష్టానం నుంచి ఆయ‌న‌కు ఈసారి టిక్కెట్ ద‌క్క‌లేదు. దీంతో ఆయ‌న‌ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగ‌నున్నారు. రేపు త‌న అనుచ‌రుల‌తో క‌ల‌సి ఎంపీ అభ్య‌ర్థిగా నామినేషన్ వేయ‌నున్న‌ట్టు జిల్లా పార్టీ శ్రేణుల‌కు తెలిపారు. ఈ సంద‌ర్భంగా జిల్లా కేంద్రంలో పార్టీ శ్రేణులతో సమావేశమైన ఆయ‌న.. పార్టీని అంటిపెట్టుకొని ఉన్న నేతలకు టికెట్లు ఇవ్వకుండా పార్టీలు మారే వ్యక్తులకు టికెట్ ఇవ్వడం బాధాకరమ‌ని అన్నారు. పార్టీలో అగ్రవర్ణాల పెత్తనం పెరిగిపోయి, కష్టపడ్డవారిని మోసం చేస్తున్నారన్నారు. 2014 ఎంపీ ఎన్నికల్లో రెండవ స్థానంలో నిలిచిన నన్ను కాదని 3వ స్థానంలో నిలిచింది రాథోడ్ రమేష్ కి టికెట్ ఇవ్వడంలో ఆంతర్యమేమిటో అంతుప‌ట్ట‌డం లేద‌న్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అమ్మేస్తున్నారని , ఒకరిద్దరు అగ్రనాయకుల వైఖరి వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ అవుతుందని న‌రేష్ జాద‌వ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. క‌నీసం వివరణ కూడా అడగకుండా త‌న‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఎంతో బాధ‌కు గురి చేసింద‌ని , ఏఐసిసి మెంబర్ గా ఉన్న త‌న‌ను సస్పెండ్ చేసే హక్కు పిసిసి కి లేదని అన్నారు. రేపు స్వ‌తంత్ర అభ్య‌ర్ధిగా నామినేష‌న్ వేసి, త‌న‌కు టిక్కెట్ రాకుండా చేసిన నేతల భరతం పడుతాన‌ని జాద‌వ్ ఈ సంద‌ర్భంగా హెచ్చ‌రించారు.