
పలు ఆర్థిక మోసాలకు పాల్పడి ఢిల్లీలోని మండోలీ జైలులో శిక్ష అనుభవిస్తోన్న సుఖేష్ చంద్రశేఖర్ చంద్రశేఖర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని ఫార్మా కాంట్రాక్టర్ నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్కు ముడుపులు అందాయని ఆరోపించారు. 2020లో ఫార్మా కాంట్రాక్టర్ నుంచి అందిన ముడుపులతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ దుబాయ్ లో మూడు అపార్ట్మెంట్లను కూడా కొనుగోలు చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారం రోజుల క్రితం మూడు అపార్ట్మెంట్లను కేజ్రీవాల్ అత్యవసరంగా అమ్మకానికి పెట్టారన్నారు. ఈ మేరకు సుఖేష్ చంద్రశేఖర్ జైలు నుంచి మరో లేఖవిడుదల చేశారు. తన తరపు న్యాయవాది అనంత మాలిక్ ద్వారా ఈ లేఖ విడుదల చేశారు.
''కేజ్రీవాల్ జీ, 2020లో హైదరాబాద్ లోని ఫార్మా కాంట్రాక్టర్ నుంచి మీరు అందుకున్న కమీషన్లతో నా ద్వారా కొనుగోలు చేసిన జుమైరా పామ్స్ లో ని మూడు అపార్ట్మెంట్లను అత్యవసరంగా 65 మిలియన్ దిర్హామ్స్ (ఏఈడీ)కు అమ్మమని మీరు దుబాయ్ లోని మీ సహచరుడు మనోజ్ జైన్ను కోరినట్లు నాకు తెలిసింది అంటూ సుఖేష్ లేఖలో పేర్కొన్నరు. ‘‘మీరు నిజం మాట్లాడరు కాబట్టి, నాకు, సత్యేందర్ జైన్ కు మధ్య జరిగిన మూడు పేజీల వాట్సాప్ చాట్లను విడుదల చేస్తాను. ఇందులో దుబాయ్ లోని మూడు అపార్ట్మెంట్ల కొనుగోలు లావాదేవీలు ఉన్నాయి. ’’ అని రాసుకొచ్చారు.
వచ్చే ఏడు రోజుల్లో ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్), యాంటీ కరప్షన్ విజిలెన్స్ కు కూడా ఒక కాపీని పంపుతాని సుఖేష్ తన లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీలోని న్యాయపాలనకు సంబంధించిన అంశాలను తరచూ లేవనెత్తే కేజ్రీవాల్, ఆయన భాగస్వాములు తనకు, తన కుటుంబానికి ముప్పు తెస్తున్నారని చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నారు.
నా తల్లిని కేజ్రీవాల్ సహాయకుడు బెదిరించాడు: సుఖేష్ చంద్రశేఖర్
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సన్నిహితుడు తన తల్లిని బెదిరించాడని సుఖేష్ చంద్రశేఖర్ ఆరోపించారు. "నేను ఇలాంటి చర్యలు ఆపకపోతే నా ఆహారంలో విషం కలుపుతానని బెదిరించారు. కేజ్రీవాల్ నాపై, నా కుటుంబంపై మీరు చేస్తున్న ఒత్తిడికి మీరు గట్టి సమాధానం అందుకుంటారు. మీరు ఖచ్చితంగా తీహార్ క్లబ్లో చేరుతారన్న విషయం మర్చిపోవద్దు అంటూ సుఖేష్ అన్నారు .
అంతకుముందు మే 6న, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఉన్న విలాసవంతమైన గృహోపకరణాలకు నిధులు సమకూర్చినట్లు పేర్కొంటూ జైలు శిక్ష అనుభవిస్తున్న నిందితుడు సుఖేష్.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ పంపారు. మండోలి జైలులో ఉన్న చంద్రశేఖర్.. విలాసవంతమైన గృహోపకరణాల కోసం తాను వ్యక్తిగతంగా డబ్బు చెల్లించానని, జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు సత్యేందర్ జైన్తో పాటు కేజ్రీవాల్ స్వయంగా ఎంపిక చేశారని ఆరోపించారు.