IAS రోనాల్డ్ రోస్‎కు హైకోర్టులో చుక్కెదురు.. క్యాట్ ఉత్తర్వులపై స్టే

IAS రోనాల్డ్ రోస్‎కు హైకోర్టులో చుక్కెదురు.. క్యాట్ ఉత్తర్వులపై స్టే

హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్ అధికారి రోనాల్డ్ రోస్‎కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. రోనాల్డ్ రోస్‎ను తెలంగాణకు కేటాయిస్తూ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌(క్యాట్‌) ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. కాగా, రోనాల్డ్ రోస్‎ను ఆంధ్రప్రదేశ్‎కు కేటాయిస్తూ 2024 అక్టోబర్‎లో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ (DOPT) ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. 

ఈ క్రమంలో డీవోపీటీ ఉత్తర్వులను రోనాల్డ్ రోస్‎ క్యాట్‎లో సవాల్ చేశారు. స్థానికత ఆధారంగా రోనాల్డ్ రోస్‎ను క్యాట్ తెలంగాణకు అలాట్ చేసింది. దీంతో క్యాట్ ఉత్తర్వులను డీవోపీటీ తెలంగాణ హైకోర్టులో అప్పీల్ చేసింది. డీవోపీటీ అప్పీల్‎పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. ఈ మేరకు క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

ఏపీ, తెలంగాణ విభజన సమయంలో ఐఏఎస్ రోనాల్డ్ రోస్‎ను డీవోపీటీ ఆంధ్రప్రదేశ్ కేడర్‎కు అలాట్ చేసింది. అయితే.. అప్పుడు క్యాట్‎ను ఆశ్రయించి పది సంవత్సరాల పాటు తెలంగాణలోనే విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలో ఏపీకి అలాట్ అయ్యి తెలంగాణలోనే పని చేస్తోన్న ఐఏఎస్, ఐపీఎస్‎లను తిరిగి ఏపీకి వెళ్లాలని 2024లో డీవోపీటీ ఆదేశించింది. 

డీవోపీటీ ఆదేశాలను రోనాల్డ్ రోస్ క్యాట్‎లో సవాల్ చేశారు. తనను తెలంగాణకే కేటాయించాలని క్యాట్‌ను కోరారు. స్థానికత ఆధారంగా రోనాల్డ్ రోస్‎ను తెలంగాణకే కేటాయిస్తూ క్యాట్ అతడికి అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో క్యాట్‌ ఉత్తర్వులపై డీవోపీటీ మళ్లీ తెలంగాణ హైకోర్టులో అప్పీల్‌ చేసింది. ఈ అప్పీల్‌ను విచారించిన హైకోర్టు క్యాట్‌ ఉత్తర్వులపై స్టే విధించింది. దీంతో రోనాల్డ్ రోస్ ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.