
గత పదేళ్లుగా స్వయం సహాయక సంఘాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి గురైన స్వయం సహాయక మహిళ సంఘాలను ఆర్థికంగా బలపరిచామని చెప్పారు. జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్లో వీహబ్ వుమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా.. తెలంగాణ 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారాలంటే.. కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలన్నారు.
మహిళా శక్తి ని ఎప్పుడు కూడా తమ ప్రభుత్వం తక్కువ అంచనా వెయ్యలేదని సీఎం రేవంత్ అన్నారు. 1967 లో చైనాతో, 1971 పాకిస్తాన్ తో యుద్ధాలు జరిగినప్పుడు ఇందిరాగాంధీ ప్రపంచానికి మహిళా శక్తిని చూపించారన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జరిగిన యుద్దాలలో ఈ దేశాన్ని గెలిపించింది మహిళా శక్తి అని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీకి సుధీర్ఘకాలం అధ్యక్షురాలుగా సోనియా గాంధీ బాధ్యత నెరవేర్చి మహిళా శక్తి అంటే ఏంటో చూపించారని అన్నారు. రైట్ టూ ఎడ్యుకేషన్ యాక్ట్, రైట్ టూ ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చిన ఘనత సోనియా గాంధీది అని అన్నారు.
►ALSO READ | సీఎం మార్పు, మంత్రివర్గ విస్తరణపై పీసీసీ చీఫ్ మహేశ్ కీలక వ్యాఖ్యలు
మహిళలే ఈ దేశానికి ఆదర్శమని, మహిళా శక్తి కి అండగా ఉంటే ఈ దేశం అభివృద్ధి దిశగా వెళ్తుందని ఈ సందర్భంగా సీఎం రేవంత్చెప్పారు. ఒక్క మహిళని ఆర్థికంగా నిలబెడితే మొత్తం కుటుంబం బాగుపడుతుందని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక మహిళకి మహాలక్ష్మి స్కీమ్ కింద ఉచిత బస్సు కార్యక్రమం తీసుకొచ్చి.. 16 నెలల్లో రూ.2 వేల కోట్లకు పైనే ఆర్టీసీకి చెల్లించిందని చెప్పారు.
మహిళా సంఘాలకు సోలార్ పవర్ ను ఉత్పత్తి చేసే అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళలు ఆర్థిక క్రమశిక్షణతో ముందుకెళ్తున్నారని కొనియాడారు. ఈ రాష్ట్రానికి 10 వేల మెగావాట్ల సోలార్ పవర్ అవసరం ఉందని, సోలార్ పవర్ ఉత్పత్తిలో మహిళళను భాగస్వామ్యం చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు.