సరైన నాయకుడు ఉంటే తెలంగాణకు మంచి భవిష్యత్తు: రిటైర్డు ఐఏఎస్ చంద్రవదన్

సరైన నాయకుడు ఉంటే తెలంగాణకు మంచి భవిష్యత్తు: రిటైర్డు ఐఏఎస్ చంద్రవదన్

ఆరేండ్లుగా ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదు

కరోనా విషయంలో గవర్నమెంట్ ది ఓవర్ కాన్ఫిడెన్స్

అధికారులు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లేదు

బదిలీల్లో ట్రాన్స్ పరెన్సీ ఉంలి

‘వామ్ కాస్ట్’లో గడ్డం వంశీ ఇంటర్వ్యూలో రిటైర్డు ఐఎఎస్ ఆఫీసర్ ఆర్వీ చంద్రవదన్

 ఏ ఆకాంక్షల కోసమైతే పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో.. ఆ కాంక్షలు నెరవేరడం లేదని.. ఒకటి రెండు సెక్టార్లలో తప్ప ఎక్కడా పరిస్థితి బాగా లేదని రిటైర్డు ఐఎఎస్ ఆఫీసర్ ఆర్వీ చంద్రవదన్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు నిర్ణయాలు తీసుకునే స్వేచ్చ లేకుండా పోయిందన్నారు. సర్కారు దవాఖానాలపై నమ్మకం కలిస్తే ప్రజలు ప్రైవేటుకు పోయే పరిస్థితి ఉండదని చెప్పారు. స్టేట్ మన్ లా ఆలోచించే సరైన నాయకుడు ఏంటే.. తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అభిప్రాయపడ్డారు. ‘వామ్ కాస్ట్’లో గడ్డం వంశీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన రాష్ట్రంలోని పరిస్థితులపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. అందులోని ముఖ్యాంశాలు…

 గడ్డం వంశీ: ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు రాష్ట్రంలో పాలన నడుస్తున్నదా ?

చంద్రవదన్: ప్రజలు ఆశించిన తెలంగాణ వేరు.. ఇప్పుడు చూస్తున్నది వేరు.. ఒకటి రెండు సెక్టార్లలో తప్ప మిగతా ఏ రంగంలోనూ పరిస్థితి బాగా లేదు. సోషల్ సెక్టర, సోషల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, నిరుద్యోగం వంటి అంశాల్లో  ప్రజలు చాలా నిరాశతో ఉన్నారు. వారికి ఆరేండ్లుగా ఏం చేస్తున్నారన్నది ఆలోచించాలి. అందరికీ ఉద్యోగాలు వస్తాయని ఉద్యమ టైంలో నాయకులు చెప్పారు. ప్రజల ఆశలను తారా స్థాయికి తీసుకువెళ్లారు. కానీ.. అవేవీ చేయడం లేదు.

సెక్రటేరియట్ కూల్చివేతపై మీ అభిప్రాయం..?

సెక్రటేరియట్ కూల్చడం.. కట్టడం అవసరమా..? ప్రజలు కోరుకున్నారా ? ఇతర అవసరాల కన్నా అది అంత ముఖ్యమా? అని సర్కార్ ఆలోచించాలి. ఒకవైపు మనకు వనరులు లేవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రూ.500 కోట్లు సెక్రటేరియట్ కోసం ఖర్చు చేయడం ఎందుకు? సెక్రటేరియట్ కూల్చాలని ఏ అధికారి కూడా అడగలేదు. కూల్చివేసిన సెక్రటేరియట్ కు ఇరవై.. ముప్పై ఏండ్ల లైఫ్ ఉంది.

 ప్రభుత్వం కరోనాను ఎలా హ్యాండిల్ చేస్తోంది..?

కరోనా విషయంలో రాష్ట్ర సర్కార్ ఓవర్ కాన్ఫిడెన్స్ కు పోయింది. ఢిల్లీలో ఇతర రాష్ర్టాలలో చూడండి.. అంతెందుకు మన ప్రధాని కూడా ఎక్స్ పర్ట్స్ బాడీని ఏర్పాడు చేసి సలహాలు తీసుకుంటున్నారు. మన ద్దగర అలాంటి ఎక్స్ పర్ట్స్ బాడీ లేదు. కరోనాపై రాష్ర్ట ప్రభుత్వం వేసుకున్న అంచనా తప్పు. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ను తుంగలో తొక్కారు. కేంద్ర మార్గదర్శకాలను డైల్యూట్ చేశారు. మొండి వైఖరి అవలంబించి, తాము చెప్పిందే కరెక్ట్ అని అనేక పొరపాట్లు చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళితే.. బతికొస్తామన్న నమ్మకం ప్రజలకు లేదు. అందుకే అప్పోసప్పో చేసి ప్రైవేటు హాస్పిటల్స్ కు వెళ్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ పై ప్రభుత్వం నమ్మకం కలిగిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కరోనా కంట్రోల్ విషయంలో ఆఫీసర్లకు,డాక్టర్లకు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లేకుండా పోయింది.

 ట్రాన్స్ ఫర్ వివాదాలపై మీరేమంటారు.. ?

తాము చెప్పింది చేసే అధికారులకు ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి. దీని వల్ల సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. రాష్ర్టంలోని బీసీ,ఎస్సీ, ఎస్టీ వర్గాల ఆఫీసర్లకు సరైన న్యాయం జరగడం లేదనే అంశం చాలాసార్లు తెరమీదకు వచ్చింది. కేవలం ఒక వర్గం అధికారులకే పెద్దపీట వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇతర వర్గాల వారిని అప్రాధాన్య పోస్టుల్లో వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ట్రాన్స్ ఫర్స్ లో ట్రాన్స్ పరెన్సీ ఉండాలి.

ఆరేండ్లు అవుతున్నా మార్పెందుకు రాలేదు..?

ఇప్పుడున్న ప్రభుత్వం, ప్లానర్స్ పబ్బం గడుపుకోవడానికే ఎక్కువ ప్రయత్నిస్తున్నారు. ఏదో రెండు మూడు చేసేసి దానితో ప్రజల్లో విశ్వాసం పొందాలని ప్రయత్నిస్తున్నారు. పాపులిజం నడుస్తున్నది. చాలా అంశాల్లో  ప్లాన్డ్ గా వెళ్తే బాగుండేది. రాష్ర్టంలో నీడ్ బేస్ట్ ప్లానింగ్ లేదు. ప్రభుత్వం అప్పులెక్కువగా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2014 నుంచి చూస్తే.. పుట్టబోయే పిల్లల మీద కూడా ఒక్కొక్కరిపై రూ.70 వేల అప్పు తీసుకున్నట్లు లెక్కలు చెప్తున్నాయి.

 తెలంగాణ భవిష్యత్తు ఏమిటి..?

ప్రజల్లో చైతన్యం పెరిగింది. ప్రశ్నిస్తున్నారు. మీడియాను కంట్రోల్ చేసినా.. సోషల్ మీడియాను కంట్రోల్ చేయలేం. రాబోయే రోజుల్లో తెలంగాణ ఉజ్వల రాష్ర్ర్టంగా అవతరిస్తుంది. స్టేట్ మన్ లా ఆలోచించే రైట్ లీడర్ షిప్ అవసరం.