
ఘట్ కేసర్, వెలుగు: ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే.. కడుపులో పెట్టుకుని చూసుకుంటానని మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేశ్ యాదవ్ తెలిపారు. మంగళవారం మేడ్చల్ సెగ్మెంట్లోని కొండాపూర్, బాలాజీనగర్, అంబేద్కర్ నగర్, అంబేద్కర్ చౌరస్తా, ఎన్ ఎఫ్సీలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లకు కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ నేత నక్కా ప్రభాకర్ గౌడ్తో కలిసి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా వజ్రేశ్ యాదవ్ మాట్లాడుతూ.. స్థానికుడైన తనకు మేడ్చల్ వాసుల కష్టాలు తెలుసన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయన వెంట ఘట్కేసర్ మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.