
సంగారెడ్డి జిల్లాలో ఏడు నెలల్లో రూ.1.51 కోట్ల విలువైన బియ్యం సీజ్
సంగారెడ్డి/జహీరాబాద్, వెలుగు : సంగారెడ్డి జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా రోజురోజుకూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఎక్కువగా 65వ నేషనల్ హైవేలోని ముత్తంగి, ఓఆర్ఆర్, జహీరాబాద్, కోహిర్, మాడ్గి ప్రాంతాల్లో పట్టుబడుతున్నాయి. అయితే ముందస్తు సమాచారంతో మాత్రమే తనిఖీలలో బియ్యం పట్టుబడుతున్నాయి. రెగ్యులర్ తనిఖీలు లేక పేదల కోసం పంపిణీ చేస్తున్న బియ్యం ముంబై హైవేను ఆసరా చేసుకుని వ్యాపారులు అక్రమంగా రాష్ట్రాలు దాటిస్తున్నారు.
చెక్ పోస్టులు లేకనే..
జీఎస్టీ అమలుతో కమర్షియల్ చెక్ పోస్టులు పూర్తిగా ఎత్తేయడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జహీరాబాద్ సమీపంలోని బీదర్ చౌరస్తా, చిరాగ్ పల్లి చెక్ పోస్టులు ఎత్తేశారు. జహీరాబాద్, న్యాల్కల్ మండలాల్లోని గంగ్వార్, డప్పుర్, న్యాల్కల్, చీకుర్తి మీదుగా కర్ణాటకలోని బీదర్, మహారాష్ట్రలకు తేలికపాటి వాహనాలలో తరలిస్తున్నారు. అలాగే మరో మార్గంగా జహీరాబాద్ మీదుగా చిరాగ్ పల్లి, కర్ణాటకలోని మన్నాఎక్కెళ్లి, హమ్నాబాద్ కు పంపిస్తున్నారు. ఆయా ప్రాంతాలలోని బియ్యం వ్యాపారులు కొందరు మహారాష్ట్ర, గుజరాత్ లకు తరలించి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. అయితే జిల్లాలోని కంగ్టి, కల్హేర్, మనూర్, నారాయణఖేడ్, నాగల్ గిద్ద, న్యాల్కల్ మండలాల పరిధిలోని గ్రామాల రైస్ మిల్లులకు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు విజిలెన్స్ ఆఫీసర్ల నివేదికలో ఇదివరకు తేలింది. అలాగే జహీరాబాద్ సుభాష్ గంజ్ మార్కెట్ అడ్రస్ పేరుతో కొందరు నకిలీ ట్రేడింగ్ లైసన్స్ తో రేషన్ బియ్యాన్ని బార్డర్ దాటిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దళారీలు కిలో రేషన్ బియ్యాన్ని రూ.10కి కొనుగోలు చేసి అక్రమార్కులకు రూ.18 చొప్పున విక్రయిస్తున్నారు. అయితే దొడ్డు బియ్యానికి మహారాష్ట్ర, గుజరాత్ లలో డిమాండ్ ఉండడంతో అక్కడ కిలో బియ్యం రూ.35 నుంచి రూ.45 వరకు ధర పలుకుతున్నట్లు తెలుస్తోంది.
7 నెలల్లో 30 వెహికల్స్ సీజ్...
ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు పట్టుబడిన రేషన్ బియ్యం విలువ రూ.కోట్లల్లో ఉంది. మొత్తం 30 వెహికల్స్ పట్టుబడగా 5,819 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. ప్రభుత్వం క్వింటాల్ రేషన్ బియ్యానికి రూ.2,600 వరకు ఖర్చు చేస్తోంది. ఈ లెక్కన పట్టుబడిన బియ్యం విలువ రూ.1.51 కోట్లకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కానీ సివిల్ సప్లై ఆఫీసర్లు మాత్రం పట్టుబడిన బియ్యం విలువ రూ.65 లక్షలు ఉంటుందన్న అంచనాలో ఉన్నారు. ఏదేమైనా భారీగా బార్డర్ దాటుతున్నా రేషన్బియ్యం అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.