- సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఘటన
సదాశివపేట, వెలుగు: భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెను దారుణంగా హత్య చేసి.. ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... సదాశివపేటలోని సిద్దాపూర్ కాలనీలో రాణి(40), జీవరత్నం(43) దంపతులు నివసిస్తున్నారు. రోజువారీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జీవరత్నం భార్యపై అనుమానం పెంచుకుని తరచూ గొడవ పడుతున్నాడు. శుక్రవారం సాయంత్రం కూడా రాణితో ఇంట్లో గొడవపడ్డాడు.
ఆవేశంతో ఆమె తలపై రోకలిబండతో కొట్టాడు. తీవ్ర రక్తస్రావం జరిగి కుప్పకూలిన రాణి అక్కడికక్కడే మృతిచెందింది. భార్య చనిపోయిందని నిర్ధారించుకున్న జీవరత్నం.. తీవ్ర మనోవేదనతో బయటకు వెళ్లి పక్కనే ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని భార్యాభర్తల మృతదేహాలను పోస్టుమార్టం కోసం సదాశివపేట హాస్పిటల్కు తరలించారు. అనుమానమే ఈ హత్యకు కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మరేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.

