- కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వెలుగులోకి..
- విచారణకు ఆదేశించిన సీపీ గౌష్ ఆలం
కరీంనగర్, వెలుగు : చనిపోయిన ముగ్గురు కానిస్టేబుళ్ల ఐడీ నంబర్లను ఉపయోగించి ఓ ఉద్యోగి అక్రమంగా జీతాలు డ్రా చేసుకున్న ఘటన కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గురువారం వెలుగుచూసింది. ఇలా ఇప్పటివరకు మొత్తం రూ. 1,40,18,308 దారి మళ్లినట్లు టాస్క్ఫోర్స్ ఆఫీసర్ల విచారణలో తేలింది. వివరాల్లోకి వెళ్తే.. కమిషనరేట్ పరిధిలో పే సెక్షన్లో పనిచేసే ఓ ఉద్యోగి.. గతంలో చనిపోయిన ముగ్గురు కానిస్టేబుళ్ల ఎంప్లాయ్ ఐడీలను ఉపయోగించి ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఇతర వ్యక్తుల పేర్లను చేర్చాడు.
ఆ తర్వాత వారి పేరుతో ప్రైవేట్ బ్యాంకుల్లో అకౌంట్లు తెరిచి, వాటికి తన మొబైల్ నంబర్ను లింక్ చేయించాడు. ఇలా ముగ్గురి పేరిట 2022 నుంచి ఇప్పటివరకు జీతాలు డ్రా చేశాడు. ఈ విషయం బయటకు తెలియడంతో స్పందించిన సీపీ గౌష్ ఆలం విచారణకు ఆదేశించారు. సీపీ ఆదేశాలతో పే సెక్షన్ ఉద్యోగిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కరీంనగర్ వన్ టౌన్ సీఐ రాంచందర్రావు చెప్పారు. ఈ అక్రమంలో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. పూర్తి విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ వెల్లడించారు.
