రాష్ట్రంలో ని పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో(20,21 తేదీల్లో) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది.
ఆదిలాబాద్, మంచిర్యాలు, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ సహా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారీ వర్షంతో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు కురుస్తాయని వెల్లడించింది. ప్రజలు చెట్ల కింద ఉండొద్దని.. అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని హెచ్చరించింది. మరో వైపు రానున్న 48 గంటల్లో హైదరాబాద్తో పాటు తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
ALSO READ :జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం
ఇప్పటికే సోమవారం రాత్రి(జులై 17) అల్పపీడన ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ముసురు పెడుతోంది. నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు సహా ఉత్తర తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో కూడా అడపాదడపా జల్లులు పడుతున్నాయి.