తెలంగాణలో రాబోయే 4 రోజులు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణలో రాబోయే 4 రోజులు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

ఎండ, వేడిగాలులతో సతమతం అవుతున్న రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఆదివారం, సోమవారం రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. దీంతో ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. 

ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మిగిలిన చోట్ల అక్కడక్కడ చిరు జల్లులు కురుస్తాయని వెల్లడించింది. ఇక రాబోయే ఏడు రోజులు రాష్ట్రమంతటా గరిష్ఠ పగటి ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు స్థిరంగా నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.